భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గ్రామ పంచాయతీ –సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు గురువారం జిల్లా కేంద్రంలోని రవి మహల్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ తమ పరిధిలో ఉన్న సహజ వనరులు, స్థానిక ఆదాయ మార్గాలను గుర్తించి పంచాయతీ ఆదాయాన్ని పెంచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీ రాబోయే మూడు సంవత్సరాల కాలానికి గ్రామ పంచాయతీ–సమగ్ర అభివద్ధి ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణ ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలని తెలిపారు. జీ రామ్ జీ పథకంలో భాగంగా జాబ్ కార్డు కలిగిన వారికి 125 రోజుల పని దినాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, జెడ్పీసీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ యాదగిరి పాల్గొన్నారు.


