సెప్టెంబర్ 20న ఫలితాలు
15 నుంచి ‘ఏక్ పేడ్ మా కే నామ్–సోయింగ్ టు గ్రోయింగ్’
సూర్యాపేటటౌన్ : పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో ఓ మొక్క)–సోయింగ్ టు గ్రోయింగ్–2026’ జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకోవడమే కాకుండా ఆకర్షణీయమై బహుమతులు గెలుచుకోవచ్చు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్స్ (టీఎన్జీసీ), జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం పోస్టర్ను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆవిష్కరించారు.
పర్యావరణంపై అవగాహన పెంచడమే లక్ష్యం
విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు మొక్కల పెంపకాన్ని జీవనశైలిలో భాగంగా మార్చడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి సంరక్షించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కోదాంట్లో కనీసం పది పండ్ల మొక్కలు, ఇతర మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రతిఒక్కరూ భాగస్వాములే..
ఈ పోటీలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థలు, సాధారణ పౌరులూ పాల్గొనే అవకాశం కల్పించారు. మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ తయారీ, పర్యావరణపై అవగాహన వంటి కార్యకలాపాల్లో పాల్గొని వాటికి సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేయడం ద్వారా పోటీలో అన్ని విద్యాసంస్థల విద్యార్థులు భాగస్వాములు కావచ్చు.
ఫొటో అప్లోడ్ ఇలా..
ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు తమ తల్లి పేరు మీద ఒక మొక్కను నాటి ఈ సెల్ఫీని నేషనల్ గ్రీన్ కార్స్(ఎన్జీసీ) పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఫొటో అప్లోడ్ చేయగానే వెంటనే మీ సెల్ఫీతో కూడిన ఈ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. ఎక్కడైతే ఎక్కువగా సర్టిఫికెట్లు అయ్యాయో వాటిని గుర్తించి నగదు ప్రోత్సాహకాలు అందిస్తారు. సీడ్ బాల్స్(విత్తన బంతులు) తయారీలోనూ చురుగ్గా వ్యవహరించే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రతి విద్యార్థి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అన్ని ప్రభు త్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. పర్యావరణ పరిక్షణను విద్యార్థుల దైనందిన జీవితంలో భాగంగా మార్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.
– ఎల్.దేవరాజు, ఎన్జీసీ జిల్లా కోఆర్డినేటర్
ఫ జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ
పేరుతో కార్యక్రమం
ఫ సెప్టెంబర్ 15 వరకు నిర్వహణ
ఫ ప్రతి పాఠశాలలో కనీసం పది
పండ్ల మొక్కలు నాటేలా కార్యాచరణ
ఫ అధిక స్కోర్ సాధించే వారికి ప్రోత్సాహకాలు అందజేత
జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు అన్ని కలిపి 1,200కుపైగా విద్యాసంస్థలు ఉంటే వీటిల్లో లక్షకుపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈ పోటీలు జరగుతాయి. దీంతోపాటు పర్యావరణంపై క్విజ్పోటీలు నిర్వహిస్తారు. పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. సెప్టెంబర్ 20న ఫలితాలు వెల్లడిస్తారు. జిల్లాల వారీగా అత్యధిక స్కోర్ సాధించిన ఐదుగురు విద్యార్థులకు, ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా కృషి చేసిన హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు. తద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని విస్తరింపజేసి ‘హరిత సూర్యాపేట’ లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని అధికారులు భావిస్తున్నారు.


