ఆర్సీబీకి ఆడాలని ఆరాటపడుతున్న పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌ | Mohammad Amir Expresses Desire To Play For RCB | Sakshi
Sakshi News home page

ఆర్సీబీకి ఆడాలని ఆరాటపడుతున్న పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌

Mar 8 2025 3:27 PM | Updated on Mar 8 2025 3:32 PM

Mohammad Amir Expresses Desire To Play For RCB

పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మొహమ్మద్‌ అమీర్‌ ఐపీఎల్‌ ఆడాలని తెగ ఆరాటపడిపోతున్నాడు. ప్రత్యేకించి ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాలని కలలు కంటున్నాడు. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలు సరిగ్గా లేని కారణంగా పాక్‌ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఎంట్రీ లేని విషయం తెలిసిందే. అయితే అమీర్‌ బ్రిటన్‌ పౌరసత్వం పొంది తన ఐపీఎల్‌ కల నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నాడు. అమీర్‌కు 2026 నాటికి యూకే పాస్ట్‌పోర్ట్‌ వస్తుంది. అప్పుడు ఐపీఎల్‌ వేలంలో తన పేరును రిజిస్టర్‌ చేసుకోవాలని అనుకుంటున్నాడు.

విరాట్‌ అంటే అమితమైన అభిమానం
ఎడమ చేతి వాటం ఫాస్ట్‌ బౌలర్‌ అయిన అమీర్‌కు విరాట్‌ కోహ్లి అంటే అమితమైన అభిమానం. ఈ విషయాన్ని అమీర్‌ చాలా సందర్భాల్లో చెప్పాడు. 2016 టీ20 ప్రపంచకప్‌కు ముందు కోహ్లి తనకు బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని అమీర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇదే సందర్భంగా అమీర్‌ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి ప్రతిభను ఆరాధించే వ్యక్తి అని కొనియాడాడు. 

కోహ్లి తనకు బ్యాట్‌ ఇచ్చినప్పుడు ఉప్పొంగిపోయానని చెప్పుకొచ్చాడు. తాను కోహ్లి బ్యాటింగ్‌ను ఆరాధిస్తానని.. కోహ్లి తన బౌలింగ్‌ను గౌరవిస్తాడని తెలిపాడు. కోహ్లి ఇచ్చిన బ్యాట్‌తో చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడానని గుర్తు చేసుకున్నాడు. 

అమీర్‌ ఆర్సీబీలో చేరితే ఆ జట్టు టైటిల్‌ కల నెరవేరుతుందని మరో పాకిస్తాన్‌ ఆటగాడు అహ్మద్‌ షెహజాద్‌ అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ బౌలింగ్‌ సమస్యలు పరిష్కరించడానికి అమీర్‌ లాంటి బౌలర్‌ అవసరమని షెహజాద్‌ అన్నాడు. ఆర్సీబీ బ్యాటింగ్ ఎల్లప్పుడూ బలంగా ఉంది. వారికి బౌలింగే పెద్ద సమస్య. అమీర్ వారితో చేరితే వారు టైటిల్ గెలుస్తారని షెహజాద్ జోస్యం​ చెప్పాడు.

కాగా, 32 ఏళ్ల అమీర్‌ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. తిరిగి 2024లో (టీ20 ప్రపంచకప్‌ కోసం) రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. అయితే 2024 ప్రపంచకప్‌ కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అమీర్‌ను ఎంపిక చేయలేదు. ప్రస్తుతం అమీర్‌ ప్రపంచవ్యాప్తంగా వివిథ లీగ్‌ల్లో (ఐపీఎల్‌ మినహా) ఆడుతున్నాడు.

ఇదిలా ఉంటే, ఆర్సీబీ ఈ ఏడాది ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌తో తలపడనుంది. మార్చి 22న జరిగే ఈ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరుగనుంది.  ఈ ఏడాది ఆర్సీబీ నూతన కెప్టెన్‌గా మధ్యప్రదేశ్‌ ఆటగాడు రజత్‌ పాటిదార్‌ ఎంపికయ్యాడు. గత రెండు సీజన్లలో సారథ్యం వహించిన డుప్లెసిస్‌ను ఆర్సీబీ మెగా వేలానికి ముందు వదులుకుంది.

ఈ ఏడాది ఆర్సీబీ జట్టు..
రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, దేవ్‌దత్‌ పడిక్కల్‌, టిమ్‌ డేవిడ్‌,స్వస్థిక్‌ చికార, కృనాల్‌ పాండ్యా, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, మనోజ్‌ భాండగే, జేకబ్‌ బేతెల్‌, రొమారియో షెపర్డ్‌, స్వప్నిల్‌ సింగ్‌, మోహిత్‌ రతీ, ఫిలిప్‌ సాల్ట్‌, జితేశ్‌ శర్మ, జోష్‌ హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, లుంగి ఎంగిడి, రసిక్‌ దార్‌ సలామ్‌, సుయాశ్‌ శర్మ, యశ్‌ దయాల్‌, నువాన్‌ తుషార, అభినందన్‌ సింగ్‌

ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీ షెడ్యూల్‌
మార్చి 22- కేకేఆర్‌తో
మార్చి 28- సీఎస్‌కే
ఏప్రిల్‌ 2- గుజరాత్‌
ఏప్రిల్‌ 7- ముంబై
ఏప్రిల్‌ 10- ఢిల్లీ
ఏప్రిల్‌ 13- రాజస్థాన్‌
ఏప్రిల్‌ 18- పంజాబ్‌
ఏప్రిల్‌ 20- పంజాబ్‌
ఏప్రిల్‌ 24- రాజస్థాన్‌
ఏప్రిల్‌ 27- ఢిల్లీ
మే 3- సీఎస్‌కే
మే 9- లక్నో
మే 13- సన్‌రైజర్స్‌
మే 17- కేకేఆర్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement