కోహ్లి చెప్పింది నిజమే.. కానీ కుటుంబాన్నీ పోషించుకోవాలిగా!: బుమ్రా | IPL Vs Tests: Jasprit Burmah Reacts After Virat Kohli Rates IPL 5 Level Below Tests Remark, Says Dont Hide Behind A Bat | Sakshi
Sakshi News home page

‘కోహ్లి చెప్పింది నిజమే.. కానీ మాకూ కుటుంబం ఉంటుంది.. డబ్బు సంపాదించాలి’

Jun 19 2025 5:01 PM | Updated on Jun 19 2025 5:49 PM

IPL vs Tests: Burmah Reacts After Kohli Rates IPL 5 Level Below Tests

టెస్టు క్రికెట్‌ గురించి టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి (Virat Kohli) చేసిన వ్యాఖ్యలపై భారత పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) స్పందించాడు. కోహ్లి మాటలతో తాను ఏకీభవిస్తానని.. అయితే, పరిస్థితులకు అనుగుణంగానే క్రికెటర్లు రెడ్‌ బాల్‌ క్రికెట్‌ నుంచి ఒక్కోసారి తప్పుకోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు.

కాగా టెస్టు క్రికెట్‌ (Test Cricket)లో బ్యాటర్‌గా, భారత జట్టు కెప్టెన్‌గా చిరస్మరణీయ విజయాలు సాధించిన విరాట్‌ కోహ్లి.. ఇటీవలే సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక పద్దెనిమిదేళ్ల కలను నిజం చేసుకుంటూ.. ఐపీఎల్‌-2025 సీజన్‌లో కోహ్లి ట్రోఫీని ముద్దాడాడు. 

టెస్టు క్రికెట్‌తో పోలిస్తే ఐపీఎల్‌ ఐదు అంచెల కిందే
క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభం నుంచి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు చాంపియన్‌గా నిలవడంతో ఈ రన్‌మెషీన్‌ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. తన జీవితంలోని గుర్తుంచుకోదగ్గ గొప్ప క్షణాల్లో ఇదొకటి అని తెలిపాడు. 

అయితే, తన దృష్టిలో టెస్టు క్రికెట్‌తో పోలిస్తే ఐపీఎల్‌ ఐదు అంచెల కిందే ఉంటుందని వ్యాఖ్యానించాడు. సంప్రదాయ ఫార్మాట్‌ అంటే తనకెంతో ఇష్టమని.. యువ, వర్ధమాన క్రికెటర్లు కూడా రెడ్‌ బాల్‌ క్రికెట్‌ను గౌరవించాలని సూచించాడు.

టెస్టు క్రికెట్‌లో రాణిస్తే ప్రపంచంలో ఎక్కుడైనా ఏ ఫార్మాట్లోనైనా రాణించగలరనే ఆత్మవిశ్వాసం వస్తుందని కోహ్లి పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా బుమ్రా తనదైన శైలిలో స్పందించాడు.

కోహ్లి చెప్పింది నిజమే
‘‘కోహ్లి చెప్పినట్లు టెస్టు ఫార్మాట్లో ఆడటం ద్వారా ఆటగాడిగా గొప్ప గౌరవం లభిస్తుంది. నేను కూడా యువ క్రికెటర్లకు ఈ ఫార్మాట్‌ను గౌరవించమని, వీలైనంత ఎక్కువగా ఆడమనే చెప్తాను. అయితే, అందరి పరిస్థితి ఒకేలా ఉండదు. నేను కూడా చిన్నప్పటి నుంచి టెస్టు క్రికెట్‌పై ప్రేమను పెంచుకున్నాను.

నా దృష్టిలో అదే అత్యుత్తమమైనది. సంప్రదాయ క్రికెట్‌లో ప్రదర్శన ఆధారంగానే నా స్థాయిని అంచనా వేసుకునేవాడిని. అయితే, ఇప్పటి ఆటగాళ్ల ఆలోచనా విధానం వేరుగా ఉంది. టీ20 క్రికెట్‌ వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.

డబ్బు సంపాదించాలి కదా!
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు జరుగుతున్నాయి.  ఆటగాళ్ల మైండ్‌సెట్‌ పూర్తిగా మారిపోయింది. ఏదేమైనా ఫాస్ట్‌ బౌలర్లను ఈ విషయంలో మనం తప్పుబట్టలేము. టెస్టు క్రికెట్‌ ఆడేందుకు అందరి శరీరం సహకరించకపోవచ్చు.

కెరీర్‌ కాపాడుకోవాలి. కుటుంబాన్ని పోషించుకోవాలంటే డబ్బు సంపాదించాలి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంపై అదనపు భారం వేసి కష్టపెట్టడం సరికాదు. అందుకే చాలా మంది ఫాస్ట్‌ బౌలర్లు ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉంటారని అనుకుంటున్నా.

టెస్టు క్రికెట్‌ ఆడాలనే కోరిక బలంగా ఉన్నా.. శరీరం సహకరించకపోతే వారు కూడా ఏమీ చేయలేరు కదా!’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. కాగా వెన్నునొప్పి కారణంగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025తో పాటు ఐపీఎల్‌-2025లో ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న బుమ్రా.. తర్వాత ముంబై ఇండియన్స్‌ తరఫున రీఎంట్రీ ఇచ్చాడు.

ఇక ఇప్పుడు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా టీమిండియా తరఫున అతడు పునరాగమనం చేయబోతున్నాడు. ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్‌ 20)నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది.  

చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement