’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’ | "Karma Is Unforgiving...": Ignored India Star Mukesh Kumar Shares Cryptic Post After England Tour Snub | Sakshi
Sakshi News home page

’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’

Jun 19 2025 11:38 AM | Updated on Jun 19 2025 1:16 PM

Ind vs Eng: Ignored India Star Shares Cryptic Post Karma Is Unforgiving

హర్షిత్‌ రాణా- గంభీర్‌

ఇంగ్లండ్‌తో టెస్టులకు టీమిండియా సన్నద్ధమైంది. లీడ్స్‌ వేదికగా స్టోక్స్‌ బృందంతో గిల్‌ సేన శుక్రవారం నుంచి టెస్టు సిరీస్‌ మొదలుపెట్టనుంది. కాగా ఈ సిరీస్‌తో కరుణ్‌ నాయర్‌ (Karun Nair) దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేయనుండగా.. సాయి సుదర్శన్‌​ తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ముకేశ్‌ కుమార్‌కు మొండిచేయి
మరోవైపు.. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ కూడా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, పేసర్‌ ముకేశ్‌ కుమార్‌కు మాత్రం ఈ ప్రధాన జట్టులో స్థానం లభించలేదు. ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన అనధికారిక తొలి టెస్టులో ముకేశ్‌ మూడు వికెట్లు తీశాడు.

జట్టులోకి హర్షిత్‌ రాణా
ఆ తర్వాత అతడిని రెండో అనధికారిక టెస్టు నుంచి తప్పించారు. అదే విధంగా ఇంట్రా-స్క్వాడ్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనూ అతడిని ఆడించలేదు. అదే సమయంలో.. మరో యువ ఆటగాడు, ‘ఎ’ జట్టులో ఉన్న హర్షిత్‌ రాణాను మాత్రం కవర్‌ ప్లేయర్‌గా  ప్రధాన జట్టులో చేర్చారు. ఇంగ్లండ్‌ లయన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో అతడి గొప్పగా లేకున్నా యాజమాన్యం అతడికి అవకాశం ఇవ్వడం గమనార్హం.

కర్మ ఎవరినీ వదిలిపెట్టదు
ఈ నేపథ్యంలో ముకేశ్‌ కుమార్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘‘కర్మ కచ్చితంగా తిరిగి వస్తుంది. అయితే, అందుకోసం మనం వేచి చూడాల్సి ఉంటుంది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. మొత్తం తిరిగి ఇచ్చేస్తుంది. చేసినదానికి అనుభవించకతప్పదు’’ అని ముకేశ్‌ కుమార్‌ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

కాగా టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మెంటార్‌గా ఉన్నపుడు.. ఆ జట్టు పేసర్‌ హర్షిత్‌ రాణా ప్రతిభను గుర్తించి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. 

తాను జాతీయ జట్టు కోచ్‌గా వచ్చిన తర్వాత రాణాను టీమ్‌లోకి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఇంగ్లండ్‌ పర్యటనలోనూ రాణాకు ప్రమోషన్‌ రావడం వెనుక గౌతీ ఉన్నాడని.. అతడి కోసం ముకేశ్‌పై వేటు పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ముకేశ్‌ కుమార్‌ ఇలా కర్మ తిరిగి వస్తుందంటూ పోస్ట్‌ పెట్టడం విశేషం. కాగా ఢిల్లీకి చెందిన హర్షిత్‌ రాణా టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఐదు వన్డేల్లో పది వికెట్లు,  ఒక టీ20లో మూడు వికెట్లు తీశాడు. రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. బెంగాల్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ మూడు టెస్టుల్లో ఏడు, ఆరు వన్డేల్లో ఐదు, పదిహేడు టీ20లలో కలిపి 20 వికెట్లు పడగొట్టాడు.

ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌ ‘ఎ’తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడిన టీమిండియా లండన్‌ నుంచి రైలులో లీడ్స్‌కు చేరుకుంది.  ఇక ఐదు టెస్టుల కోసం ఎంపిక చేసిన 18 మంది సభ్యుల భారత జట్టులో లేని హర్షిత్‌ రాణాను..  సుదీర్ఘ సిరీస్‌కు ముందు జాగ్రత్తగా జట్టులో చేర్చారు. 

రిజర్వ్‌ ఆటగాడిగా 
కాగా 23 ఏళ్ల పేసర్‌ ఇంగ్లండ్‌ లయన్స్‌తో అనధికారిక టెస్టులు ఆడేందుకు భారత్‌ ‘ఎ’ జట్టుతో వచ్చాడు. కాంటర్‌బరీలో జరిగిన తొలి అనధికారిక మ్యాచ్‌ కూడా ఆడి ఒక్క వికెట్‌ మాత్రమే తీశాడు.

ఈ నేపథ్యంలో రిజర్వ్‌ ఆటగాడిగా హర్షిత్‌ రాణా అందుబాటులో ఉంచామని, జట్టుతో పాటే లీడ్స్‌కు వచ్చాడని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 20 నుంచి ఇక్కడే భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతుంది. 

చదవండి: ‘సచిన్‌, గంభీర్‌, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement