Photo Credit: BCCI Twitter
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్లో ఒక అరుదైన ఫీట్ సాధించాడు. బహుశా జైస్వాల్ సాధించిన ఫీట్ ఎవరికీ సాధ్యం కాలేదనుకుంటా. ఇప్పటివరకు జైస్వాల్ తన కెరీర్లో 29 టెస్టు మ్యాచ్లు ఆడితే అవన్నీ వివిధ వేదికల్లోనే ఆడడం విశేషం. మాములుగా ఒక ఆటగాడు వేర్వేరు వేదికల్లోనే మ్యాచ్లు ఆడినప్పటికీ, కొన్నిసార్లు ఒకే మైదానంలో మ్యాచ్లు ఆడడం చూస్తుంటాం.
కానీ జైస్వాల్ విషయంలో మాత్రం లెక్క మారింది. అతడు ఆడిన 29 టెస్టులకు సంబంధించిన వేదికలు మళ్లీ రిపీట్ కాకపోవమే ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో జైస్వాల్ ఫీట్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘటనగా నిలిచిపోనుంది. ఇక శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్లోని తొలి మ్యాచ్ ద్వారా అతను తన 30వ టెస్టు మ్యాచ్ను గాలే వేదికగా ఆడబోతున్నాడు.
గాలేలో జైస్వాల్కు ఇదే తొలి మ్యాచ్ కావడంతో, ఈ 30వ మ్యాచ్ ద్వారా కూడా అతని వేదికల వైవిధ్యం సజీవంగా కొనసాగనుంది. ఇక శ్రీలంక ఎలెవెన్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో అర్ధసెంచరీ చేయడం ద్వారా జైస్వాల్ టచ్లోకి వచ్చినట్లు అనిపిస్తోంది. ఇప్పటివరకు జైస్వాల్ 29 టెస్టుల్లో 48.75 సగటుతో మొత్తం 2,535 పరుగులు చేశాడు. ఇందులో 7 శతకాలు, 13 అర్ధ శతకాలు ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 214 పరుగులు కాగా, కెరీర్లో రెండు డబుల్ సెంచరీలు కూడా సాధించాడు.
2023లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన జైస్వాల్ అఫ్గానిస్థాన్తో చివరి టెస్టు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కూడా అవకాశాలు పొందినప్పటికీ, టెస్టుల్లో మాత్రం భారత జట్టుకు రెగ్యులర్ ఓపెనర్ గా మారాడు. ఇక శ్రీలంకతో టెస్టు సిరీస్లో భాగంగా గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి 19 వరకు తొలి టెస్టు, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్ట్ జరగనున్నాయి. మొత్తంగా ప్రపంచ క్రికెట్లో వరుసగా 30 మ్యాచ్లు వేర్వేరు స్టేడియాల్లో ఆడిన ఏకైక ఆటగాడిగా జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు.
చదవండి: ‘కెప్టెన్గా ఫెయిలైనా ఫిట్నెస్కు కొత్త అర్ధం చెప్పాడు’


