
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ (Yograj Singh) మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ఒక్కడి కోసం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు ఎంతో మంది గొప్ప ఆటగాళ్ల కెరీర్ను నాశనం చేశారని ఆరోపించాడు.
ఒక్కడికి అండగా నిలిచేందుకు సర్వనాశనం
ఈ మేరకు.. ‘‘సీనియర్ల నుంచి సౌరవ్, సచిన్, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), వీవీఎస్ లక్ష్మణ్, జవగళ్ శ్రీనాథ్, అని కుంబ్లే.. యువతరం నుంచి భజ్జీ (హర్భజన్ సింగ్), యువీ (యువరాజ్ సింగ్), వీరూ (వీరేందర్ సెహ్వాగ్), మహ్మద్ కైఫ్, జహీర్ ఖాన్.
తండ్రులు- కుమారులు.. పెద్దన్నలు- తమ్ముళ్ల కలయికతో జట్టు ఎంతో బాగుండేది. సీనియర్ల సలహాలతో జూనియర్లు రాటుదేలేవారు. కానీ మనం ఏం చేశాం?.. ఒక్కడికి అండగా నిలిచేందుకు మన ఇంటిని మనమే నాశనం చేసుకున్నాం.
అతడి పేరును నేను ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు. కానీ ఈరోజుకీ అతడి వల్లే ఇదంతా జరిగిందని చెప్పగలను. అతడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? జట్టు పరిస్థితి ఎలా ఉంది?
సచిన్ అలాంటివాడే..
స్వార్థం కోసం ఇతరుల కెరీర్ను నాశనం చేసేవాళ్లు కొందరైతే.. కొంతమంది నిస్వార్థంగా ఇతరులను ప్రేమిస్తారు. సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్ లాంటివాళ్లు రెండో కోవకు చెందిన వారు.
ఇతరుల కోసం వారు ఆడతారు. స్టార్లు కావాలన్న తాపత్రయం వారికి లేదు’’ అంటూ యోగ్రాజ్ సింగ్ ఇన్సైడ్ స్పోర్ట్స్తో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో సభ్యులైన వారిపై ఎలాంటి కారణం లేకుండానే బీసీసీఐ సెలక్టర్లు వేటు వేశారని ఆరోపించాడు.
ధోనిని ఉద్దేశించేనా?
‘‘గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మహ్మద్ కైఫ్ వంటి వాళ్ల కెరీర్ను బీసీసీఐ సెలక్టర్లు నాశనం చేశారు. 2011 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వారిని బయటకు పంపేశారు’’ అని యోగ్రాజ్ సింగ్ పేర్కొన్నాడు. కాగా టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఉద్దేశించే యోగ్రాజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
గతంలో కూడా అతడు ధోని తన కుమారుడు యువీ కెరీర్ను నాశనం చేశాడంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా.. పేరు చెప్పకపోయినప్పటికీ ధోనిని దృష్టిలో పెట్టుకునే యోగ్రాజ్ సింగ్ ఇలా మాట్లాడి ఉంటాడని క్రికెట్ ప్రేమికులు అంచనా వేస్తున్నారు.
కాగా ధోని కెప్టెన్గా వచ్చిన తర్వాత జట్టులో మార్పులు చేస్తూ యువ తారలతో నింపేశాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు అతడి హయాంలోనే ఎదిగారు. ఇక సారథిగా ధోని టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అందించాడు.
చదవండి: Ind vs Eng: కోహ్లి స్థానంలో అతడే బ్యాటింగ్ చేస్తాడు: రిషభ్ పంత్