Ind vs Eng: కోహ్లి స్థానంలో అతడే: క్లారిటీ ఇచ్చిన పంత్‌ | Not Nair Or Sai: Pant Confirms This Star Will Replace Kohli At Number 4 | Sakshi
Sakshi News home page

Ind vs Eng: కోహ్లి స్థానంలో అతడే బ్యాటింగ్‌ చేస్తాడు: రిషభ్‌ పంత్‌

Jun 18 2025 7:24 PM | Updated on Jun 18 2025 8:13 PM

Not Nair Or Sai: Pant Confirms This Star Will Replace Kohli At Number 4

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆరంభం నేపథ్యంలో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ కీలక అప్‌డేట్‌ అందించాడు. విరాట్‌ కోహ్లి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి పేరు వెల్లడించాడు. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సైకిల్‌లో భాగంగా టీమిండియా తమ తొలి సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. లీడ్స్‌ వేదికగా జూన్‌ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. కాగా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు ముందే రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రోహిత్‌ స్థానాన్ని శుబ్‌మన్‌ గిల్‌తో భర్తీ చేసిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI).. అతడికి డిప్యూటీగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ను నియమించింది. కాగా కోహ్లి నిష్క్రమణ నేపథ్యంలో టెస్టుల్లో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో ఎవరు దిగుతారన్న అంశంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

కోహ్లి వారసుడిగా కరుణ్‌ నాయర్‌, సాయి సుదర్శన్‌ పేర్లు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రి- మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో భాగంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘శుబ్‌మన్‌ గిల్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు.

అయితే, అతడు ఆడుతున్న మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్‌ చేస్తారన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేను యథావిధిగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాను’’ అని రిషభ్‌ పంత్‌ వెల్లడించాడు. దీంతో తుదిజట్టుపై మరోసారి సందిగ్దం నెలకొంది. సాయి సుదర్శన్‌ టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడా? లేదంటే ‘ట్రిపుల్‌ సెంచూరియన్‌’ కరుణ్‌ నాయర్‌ ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇంగ్లండ్‌తో టెస్టులకు టీమిండియా:
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌/వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, ఆకాశ్‌ దీప్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌.

చదవండి: టీమిండియాకు గేమ్‌ ఛేంజర్లు వీరిద్దరే: ఊహించని పేర్లు చెప్పిన ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement