
టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టోక్స్ బృందంతో తలపడే భారత జట్టులో 23 ఏళ్ల అన్క్యాప్డ్ ప్లేయర్ గేమ్ ఛేంజర్ కాబోతున్నాడని జోస్యం చెప్పాడు. అదే విధంగా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ టీమిండియాకు కీలకం కానున్నాడని పేర్కొన్నాడు.
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా తొలుత ఇంగ్లండ్ (India vs England)తో సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్ (Tendulkar-Anderson Trophy) ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ తన బ్రేకౌట్ స్టార్స్పై తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
వీరిద్దరు కీలకం
‘‘టీమిండియా తరఫున ఈ పర్యటనలో రాణించే ఆటగాళ్లలో సాయి సుదర్శన్ ముందు వరుసలో ఉంటాడని చెప్పగలను. సర్రీ తరఫున కౌంటీ క్రికెట్లో అతడు అద్భుతంగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లను అతడు సమర్థవంతంగా ఎదుర్కోగలడు’’ అని మాంటీ పనేసర్ పేర్కొన్నాడు.
అదే విధంగా.. ‘‘శార్దూల్ ఠాకూర్కు ఇది కీలకమైన టూర్. అతడి చేరికతో టీమిండియాకు రెండో బౌలిండ్ చేంజ్ ఆప్షన్ లభించినట్లయింది. మెరుగైన ఎకానమీతో వికెట్లు తీయగల సత్తా అతడికి ఉంది. కాబట్టి భారత బౌలింగ్ విభాగంలో అతడు కీలక పాత్ర పోషించనున్నాడు’’ అని మాంటీ పనేసర్ చెప్పుకొచ్చాడు. కాగా గిల్, బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లను కాదని పనేసర్ ఈ ఇద్దరి పేర్లు చెప్పడం గమనార్హం.
అత్యధిక పరుగుల వీరుడిగా
కాగా చెన్నైకి చెందిన సాయి సుదర్శన్ ఐపీఎల్-2025లో దుమ్ములేపిన విషయం తెలిసిందే. శుబ్మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ స్టార్ బ్యాటర్.. 15 మ్యాచ్లలో కలిపి ఏకంగా 759 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు మూడు వన్డేలు ఆడిన సాయి సుదర్శన్ 127 పరుగులు చేశాడు. అదే విధంగా.. ఒక టీ20 మ్యాచ్ ఆడినప్పటికీ పరుగుల ఖాతా తెరవలేదు. ఇక టెస్టుల్లో ఇప్పటి వరకు అరంగేట్రం చేయని 23 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇంగ్లండ్తో సిరీస్తో ఆ కలను నెరవేర్చుకోనున్నాడు.
అతడి రీ ఎంట్రీ
మరోవైపు.. 33 ఏళ్ల శార్దూల్ ఠాకూర్ 2024లో సౌతాఫ్రికాతో సిరీస్ తర్వాత.. ఇప్పుడే మరోసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్టు జట్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన శుబ్మన్ గిల్ ఇంగ్లండ్తో సిరీస్తో సారథిగా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఇక ఈ సిరీస్కు ముందే దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టు:
శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్/వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
చదవండి: కోహ్లి లేకుండా టీమిండియాతో సిరీస్.. స్టోక్స్ రియాక్షన్ వైరల్!