ఈ టీమిండియా క్రికెటర్లు ప్రభుత్వ ఉద్యోగులు.. ఎవరికి ఏ జాబ్‌? | List Of Indian Cricketers With Government Job | Sakshi
Sakshi News home page

ఈ టీమిండియా క్రికెటర్లు ప్రభుత్వ ఉద్యోగులు.. ఎవరికి ఏ జాబ్‌?

Aug 6 2026 12:49 PM | Updated on Aug 6 2026 2:47 PM

List Of Indian Cricketers With Government Job

టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. క్రికెట్ నుంచి కాస్త విరామం తీసుకుని ఉద్యోగిగా రిజ‌ర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో కిష‌న్‌ దర్శనమిచ్చాడు. క్రికెటర్‌గా ఉన్న కిషన్ బ్యాంక్‌లో ఉద్యోగం చేయడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే ఈ పూర్తి కథనం చదవాల్సిందే.

ఇషాన్‌కు స్పోర్ట్స్‌ కోటాలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం అతడు పాట్నాలోని ఆర్బీఐ రీజనల్ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌రిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌లో విరామం దొరకడంతో కిషన్ పనిచేసేందుకు పాట్నా ఆర్బీఐ బ్రాంచ్‌కు వెళ్లాడు.

ఐడీ కార్డ్ ధరించి తన సహచరలతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లగా ఉండి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి గురుంచి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ జాబితాలో చాలా మంది పురుష, మహిళ క్రికెటర్లు ఉన్నారు. భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనిలు సాయుధ దళాల్లో గౌరవ హోదాలు పొందారు.

కపిల్ దేవ్: భారత్‌కు తొలి వరల్డ్‌కప్ అందించిన కపిల్ దేవ్‌కు ఇండియన్ ఆర్మీ 2008లో  'లెఫ్టినెంట్ కల్నల్' గౌరవ హోదాను ప్రధానం చేసింది.  వాస్తవానికి కపిల్‌ దేవ్‌ సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అతడి తండ్రి రామ్ లాల్ నిఖాంజ్ భారత సైన్యంలో పని చేశారు.

సచిన్ టెండూల్కర్‌: 24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించినందుకు గానూ సచిన్ టెండూల్కర్‌కు ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్ గౌరవ ర్యాంక్ లభించింది. 2010లో అతడికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 'గ్రూప్ కెప్టెన్' హోదా పొందిన తొలి క్రీడాకారుడిగా సచిన్ నిలిచాడు.

ఎంఎస్ ధోని: భారత్‌కు రెండు ఐసీసీ ప్రపంచకప్‌లను అందించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కూడా సాయుధ దళాల్లో భాగమయ్యాడు. ధోని ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను కలిగి ఉన్నాడు. ధోని ఇప్పటికే పలుమార్లు మిలిటరీ శిక్షణలో పాల్గొన్నాడు.

కేఎల్ రాహుల్: ఇషాన్‌ కిషన్‌ మాదిరే మరో వికెట్‌ స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్ కూడా ఆర్బీఐ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. యువతను బ్యాంకింగ్ రంగం వైపు ఆకర్షించే క్రమంలో అతడికి ఆర్బీఐ ఈ ఉద్యోగం కట్టబెట్టింది. ఆర్‌బీఐ అవగాహన కార్యక్రమాల్లోనూ రాహుల్‌ పాల్గొంటున్నాడు.

యుజ్వేంద్ర చాహల్: భారత వెటరన్‌ స్పిన్నర్‌ యుజేంద్ర చాహల్‌ 2018 నుంచి ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఆఫీసర్‌గా సేవలు అందిస్తున్నారు.

మహమ్మద్ సిరాజ్‌: టీ20 ప్రపంచకప్‌-2024 టైటిల్‌ గెలిచిన భారత జట్టులో భాగమైనందుకు గాను పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను  తెలంగాణ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో సత్కరించింది. అతడికి నివాస స్థలాన్ని సర్కార్‌ కూడా కేటాయించింది.

ముకేష్ కుమార్, ఆకాష్ దీప్‌: భారత జట్టులో చోటు దక్కించుకుని రాణిస్తున్నందుకు స్పీడ్‌ స్టార్స్‌ ముకేష్ కుమార్, ఆకాష్ దీప్‌లకు బిహార్ ప్రభుత్వం  డీఎస్పీ హోదా ఇచ్చి గౌరవించింది.

రింకూ సింగ్‌
సాధరణ స్ధాయి నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన రింకూ సింగ్‌ను రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నియమించింది. అతడికి ఈ ఉద్యోగంతో పాటు రూ.3 కోట్ల క్యాష్‌ రివార్డును కూడా యోగి సర్కార్‌ అందజేసింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ : భారత మహిళల జట్టు కెప్టెన్‌గా అందించిన సేవలకు గానూ పంజాబ్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్నారు.

దీప్తి శర్మ: భారత మహిళల జట్టు తొలి వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మకు ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కార్‌ డీఎస్పీ పదవిని కట్టబెట్టింది.

రిచా ఘోష్: 2025 మహిళల వన్డే ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించినందుకు రిచా ఘోష్‌ను బెంగాల్‌ ప్రభుత్వం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమించింది. ఆమె ప్రస్తుతం సిలిగురి పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement