తిప్పేసిన జడ్డూ.. పీకల్లోతు కష్టాల్లో సౌతాఫ్రికా | IND vs SA 1st Test Kolkata Day 2: Jadeja Masterclass leaves SA 7 Down | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించిన జడ్డూ.. రెండోరోజూ మనదే

Nov 15 2025 4:36 PM | Updated on Nov 15 2025 5:13 PM

IND vs SA 1st Test Kolkata Day 2: Jadeja Masterclass leaves SA 7 Down

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో భారత బౌలర్లు మరోసారి సత్తా చాటారు. ప్రొటిస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్లు ప్రభావం చూపితే.. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు తిప్పేశారు. ఫలితంగా అరవై పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా.. శనివారం ఆట ముగిసే సరికి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 

కాగా రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య శుక్రవారం తొలి మ్యాచ్‌ మొదలైన విషయం తెలిసిందే. కోల్‌కతా వేదికగా ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో టాస్‌ గెలిచిన ప్రొటిస్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బౌలింగ్‌ చేసింది. పర్యాటక జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూల్చింది.

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్ల సత్తా
టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) ఐదు వికెట్ల చెలరేగి ప్రొటిస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. మొహమ్మద్‌ సిరాజ్‌ రెండు వికెట్లు తీశాడు. స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ రెండు, అక్షర్‌ పటేల్‌ (Axar Patel) ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇక సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ఐడెన్‌ మార్క్రమ్‌ (31), రియాన్‌ రికెల్టన్‌ (23).. వియాన్‌ ముల్దర్‌ (24), టోనీ డి జోర్జి (24) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.

ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్‌ మొదలుపెట్టిన టీమిండియా.. శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి వికెట్‌ నష్టానికి 37 పరుగులు చేసింది. ఇక 37/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్‌.. మరో 152 పరుగులు జతచేసి ఆలౌట్‌ అయింది.

ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (39) టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. వాషింగ్టన్‌ సుందర్‌ (29), రిషభ్‌ పంత్‌ (27), రవీంద్ర జడేజా (27) ఫర్వాలేదనిపించారు. ఫలితంగా 189 పరుగులు చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికాపై ముప్పై పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. 

ప్రొటిస్‌ బౌలర్లలో  సైమన్‌ హార్మర్‌ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో యాన్సెన్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. కేశవ్‌ మహరాజ్‌, కార్బిన్‌ బాష్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

భారత స్పిన్‌ దెబ్బకు సఫారీలు విలవిల
అనంతరం రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన సౌతాఫ్రికాకు ఆది నుంచే భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. రియాన్‌ రికెల్టన్‌ (11)ను కుల్దీప్‌ యాదవ్‌ ఎల్బీడబ్ల్యూ చేసి వికెట్ల వేట మొదలుపెట్టగా... జడ్డూ ఐడెన్‌ మార్క్రమ్‌ (4), వియాన్‌ ముల్దర్‌ (11)లను వెనక్కి పంపి సఫారీలకు కోలుకోలేని షాకిచ్చాడు.

 

అదే విధంగా.. టోనీ డి జోర్జి (2), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (5) వికెట్లను కూడా జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వికెట్‌ కీపర్‌ కైలీ వెరెన్నె (9)ను అక్షర్‌ పటేల్‌ అవుట్‌ చేయగా.. కుల్దీప్‌ యాదవ్‌.. మార్కో యాన్సెన్‌ (13)ను పెవిలియన్‌కు పంపించాడు. 

నాలుగేసిన జడ్డూ
ఫలితంగా శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి సౌతాఫ్రికా 35 ఓవర్లలో ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 93 పరుగులు చేసింది. తద్వారా టీమిండియా కంటే కేవలం 63 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్‌ బవుమా 29, కార్బిన్‌ బాష్‌ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. 

ఇక మూడోరోజైన ఆదివారం ఆటలో ఆరంభంలోనే మిగిలిన మూడు వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారంటే.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యమే ఉంటుందని చెప్పవచ్చు. స్పిన్నర్లు ఇదే జోరు కొనసాగిస్తే.. టార్గెట్‌ వంద కంటే తక్కువగానే ఉండొచ్చు.

ఇదిలా ఉంటే.. సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో జడేజా నాలుగు వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్‌ యాదవ్‌ రెండు, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. బుమ్రా ఇంకా వికెట్ల ఖాతా తెరవలేదు. సిరాజ్‌ చేతికి ఇంకా బంతి రానేలేదు.

చదవండి: ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌: గిల్‌ను బతిమిలాడిన సిరాజ్‌.. కట్‌ చేస్తే..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement