
ఇంగ్లండ్ (Ind vs Eng)తో టెస్టు సిరీస్ రూపంలో టీమిండియాకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్ 20) నుంచి ఐదు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ ద్వారానే భారత యువ ఆటగాడు శుబ్మన్ గిల్ కెప్టెన్గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), స్పిన్ లెజెండ్ రవించంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడబోయే సిరీస్ ఇదే కావడం.. అది కూడా ఇంగ్లండ్ గడ్డపై మ్యాచ్లు జరుగనుండటంతో సారథిగా గిల్ ఈ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
వాటిని పట్టించుకోకు.. సొంతంగా నిర్ణయాలు తీసుకో
ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ గిల్కు కీలక సూచనలు చేశాడు. ఒత్తిడిని జయిస్తేనే అతడు అనుకున్న ఫలితం రాబట్టగలడని పేర్కొన్నాడు. ‘‘‘అతడు అలా చేయాలి.. ఇలా చేస్తే బాగుండు’ అని బయటి నుంచి ఎన్నో అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి.
అయితే, అతడి దృష్టి మొత్తం టీమ్ ప్లాన్పై మాత్రమే కేంద్రీకృతమై ఉండాలి. డ్రెసింగ్ రూమ్లో జరిగే చర్చలపైనే ఫోకస్ చేయాలి. ప్రణాళికలకు అనుగుణంగానే జట్టు ముందుకు సాగుతుందా? లేదా? అన్న విషయాలను గమనిస్తూ ఉండాలి.
ముఖ్యంగా మ్యాచ్కు ముందు రచించే ప్రణాళికలు జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో సరిగ్గా అంచనా వేయగలగాలి. బయటి ప్రపంచం ఏమనుకుంటుందో అన్న విషయంతో సంబంధం లేకుండా.. దృష్టి మరల్చకుండా ఆటపైనే మనసు లగ్నం చేయాలి.
కొన్నిసార్లు బయటి వ్యక్తుల నుంచి తీవ్రమైన విమర్శలు రావచ్చు. అలాంటపుడు ఒత్తిడిని దరిచేరనీయకూడదు. డిఫెన్స్లో పడిపోకూడదు. ఎవరికి తోచినట్లుగా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ముందుగా చెప్పినట్లు డ్రెసింగ్ రూమ్లో చర్చలు, జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించాలి. అంతకు మించి పెద్దగా చేయాల్సిందేమీ కూడా ఉండదు’’ అని సచిన్ టెండుల్కర్ చెప్పుకొచ్చాడు.
ఇలాగే బ్యాటింగ్ చేస్తా అంటే కుదరదు
ఇక ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటర్లు మరింత జాగ్రత్తగా ఉండాలన్న సచిన్ టెండుల్కర్.. ‘‘పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాలి. అలా అయితేనే ప్రణాళికలకు తగ్గట్లుగా ముందుకు వెళ్లే వీలు ఉంటుంది. ఇదేమీ వన్వే ట్రాఫిక్ కాదు.. ‘నేనిలాగే ఉంటా.. ఇలాగే బ్యాటింగ్ చేస్తా అంటే కుదరదు’.
పిచ్ పరిస్థితులకు ఆకళింపు చేసుకున్న తర్వాతే అసలైన ఆట మొదలుపెట్టాలి’’ అని భారత ఆటగాళ్లకు సూచించాడు. ఏదేమైనా ఈసారి టీమిండియా ఇంగ్లండ్లో టెస్టు సిరీస్ గెలుస్తుందనే నమ్మకం ఉందని సచిన్ టెండుల్కర్ ధీమా వ్యక్తం చేశాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను 3-1తో సొంతం చేసుకుంటుందని అంచనా వేశాడు.
కాగా ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్కు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. కాగా ఇంగ్లండ్ గడ్డ మీద 1990- 2011 మధ్య సచిన్ ఐదు టెస్టు సిరీస్లు ఆడాడు.
చదవండి: WI Vs AUS 1st Test: వరుస వైఫల్యాలు.. స్టార్ ఆటగాడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా