ఐపీఎల్‌లో అలవాటైంది.. ఇక్కడా అదే చేశారు.. గిల్‌ మారకుంటే.. | Gill Needs Attitude Adjustment: Ex Australian Star Stunning Remark | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో అలవాటైంది.. ఇక్కడా అదే చేశారు.. గిల్‌ మారకుంటే..

Jun 28 2025 5:27 PM | Updated on Jun 28 2025 6:34 PM

Gill Needs Attitude Adjustment: Ex Australian Star Stunning Remark

టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదుర్కొన్నాడు యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill). ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు (Ind vs Eng)లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో శతకం (147)తో చెలరేగినా.. అతడి ఇన్నింగ్స్‌కు విలువ లేకుండా పోయింది.

గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి
బ్యాటింగ్‌ విభాగం రాణించినా.. బౌలర్లు.. ముఖ్యంగా ఫీల్డర్ల తప్పిదాల వల్ల గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. లీడ్స్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఏకంగా ఆరు క్యాచ్‌లు వదిలేసింది. యశస్వి జైస్వాల్‌ (Yashavi Jaiswal), రవీంద్ర జడేజా, రిషభ్‌ పంత్‌, సాయి సుదర్శన్‌ కీలక సమయాల్లో ఇంగ్లండ్‌ బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేశారు.

ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్‌ (106), రెండో ఇన్నింగ్స్‌లో బెన్‌ డకెట్‌ (149) శతకాలతో సత్తా చాటి.. మ్యాచ్‌ను టీమిండియా నుంచి లాగేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాడిన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.

ఫీల్డింగ్‌ కూడా అద్భుతమే.. కానీ ఇప్పుడు
భారత్‌ జట్టు గొప్పదని.. వారి ఫీల్డింగ్‌ కూడా అద్భుతంగా ఉండేదన్న హాడిన్‌.. గిల్‌ మాత్రం ఆ వారసత్వాన్ని కొనసాగించడంలో ఆదిలోనే విఫలమయ్యాడని పేర్కొన్నాడు. కెప్టెన్‌తో పాటు ఆటగాళ్ల ఉదాసీనత వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని విమర్శించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో భారత ఆటగాళ్లు ఇలా క్యాచ్‌లు జారవిడవడం ఎక్కువగా ఉందని.. ఇదో అలవాటుగా మారిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

‘‘ప్రతి గొప్ప జట్టు.. ఎక్కడ ఆడుతున్నా.. ఎప్పుడైనా ఫీల్డింగ్‌ విషయంలోనూ గొప్పగానే ఉంటుంది. కానీ ఈసారి గిల్‌ ఆ లెగసీని కొనసాగించలేకపోయాడు. జట్టుపై అతడు పట్టు కోల్పోయాడు. ఇప్పటికైనా గిల్‌ తన ఆటిట్యూడ్‌ మార్చుకోవాలి.

మీ జట్టు బాగా ఫీల్డింగ్‌ చేయాలన్నా.. జట్టుగా సమిష్టిగా పోరాడలన్నా కెప్టెన్‌గా నువ్వు మరింత బలంగా తయారవ్వాలి. టెక్నిక్‌ మార్చాలి. ఎంత మంది కోచ్‌లు ఉంటే ఏం లాభం?.. ఆటగాళ్ల దృక్పథంలో మార్పు రావాలి. 

ఐపీఎల్‌లో అలవాటైంది.. ఇక్కడా అదే
ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ చాలా మంది భారత ఆటగాళ్లు క్యాచ్‌లు మిస్‌ చేసిన తీరు చూశాం. దాని ఫలితమే ఇక్కడా కనిపిస్తోంది’’ అని బ్రాడ్‌ హాడిన్‌ విల్లో టాక్స్‌ పాడ్‌కాస్ట్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లింది. ఇరుజట్ల మధ్య జూలై 2-6 రెండో టెస్టుకు షెడ్యూల్‌ ఖరారైంది.

చదవండి: ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement