PC: BCCI/sonysports
శ్రీలంక మాజీ క్రికెటర్ హషాన్ తిలకరత్నె టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్పై ప్రశంసలు కురిపించాడు. గిల్ బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతమని కొనియాడాడు. అయితే, శ్రీలంక గడ్డపై మాత్రం అతడికి కఠిన సవాలు తప్పదని పేర్కొన్నాడు.
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. 2017 తర్వాత లంక గడ్డ మీద భారత్ టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత టెస్టు జట్టులో శుబ్మన్ గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు.
ఆరు శతకాలు
టెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొమ్మిది మ్యాచ్లలో కలిపి ఏకంగా ఆరు శతకాలు బాదాడు. సగటు 82కు పైగా ఉండటం విశేషం. ఇంగ్లండ్లో అత్యుత్తమంగా రాణించాడు.
అయితే, శ్రీలంకలో గిల్ రెడ్బాల్ మ్యాచ్ ఆడటం మాత్రం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో లంక మాజీ బ్యాటర్ హషాన్ తిలకరత్నె రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘గిల్ బ్యాటింగ్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అతడి బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉంటుంది.
ఇక్కడే అసలైన పరీక్ష
బ్యాటింగ్ పిచ్ల మీద అందమైన షాట్లు ఆడటం అతడికే చెల్లింది. అయితే, శ్రీలంకలో టర్నింగ్ పిచ్ల మీద అతడు ఎలా ఆడతాడన్నదే ఇప్పుడు ఆసక్తికర విషయం. ఈ సిరీస్ అతడికి నిజమైన పరీక్ష. ఇక్కడ అతడికి కఠిన సవాలు ఎదురవుతుంది. శ్రీలంక వికెట్ల మీద గిల్ ఎలా ఆడతాడో చూద్దాం’’ అని పేర్కొన్నాడు.
కాగా శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే గిల్ గాయపడిన సంగతి తెలిసిందే. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి కుడిచేతి వేలికి గాయమైంది. ఇందుకు సంబందించి బీసీసీఐ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.
ఇక గాయం కారణంగా శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం మొదలైన మూడు రోజుల వార్మప్ మ్యాచ్కు గిల్ దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో సీనియర్ బ్యాటర్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. కాగా భారత్-శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానున్నాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు.


