ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు! | His Number Will Not Come Now: Aakash Chopra On Shreyas Iyer Test Comeback | Sakshi
Sakshi News home page

ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు!

Jun 28 2025 3:22 PM | Updated on Jun 28 2025 4:20 PM

His Number Will Not Come Now: Aakash Chopra On Shreyas Iyer Test Comeback

భారత టెస్టు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్ల జాబితా పెద్దగానే ఉంది. సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్, శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) రీఎంట్రీ ఇవ్వాలని చూస్తుండగా.. అభిమన్యు ఈశ్వరన్‌ (Abhimanyu Easwaran) వంటి దేశీ హీరోలు అరంగేట్రం చేయాలని ఆరాటపడుతున్నారు. వీరిలో జురెల్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న జట్టులో ఉన్నప్పటికీ తుదిజట్టులో అతడికి ఆడే అవకాశాలు కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరిలో శ్రేయస్‌ అయ్యర్‌కు మాత్రం ఇప్పట్లో టెస్టు జట్టులో చోటు దక్కదని అభిప్రాయపడ్డాడు. అతడి కంటే సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌ల వైపే సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉందని పేర్కొన్నాడు.

చాలా సమస్యలు
ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘భారత బ్యాటింగ్‌ విభాగం కూర్పు విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న ఆటగాళ్లను ఎక్కడ ఎప్పుడు ఎలా ఆడించాలో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో శ్రేయస్‌ అయ్యర్‌కు అవకాశం దక్కదు. అతడే కాదు.. చాలా మందికి నిరాశ తప్పదు.

ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న వాళ్లలో కరుణ్‌ నాయర్‌కు ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేసే అవకాశం దక్కింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ మరోసారి వేచి చూడక తప్పని పరిస్థితి. ధ్రువ్‌ జురెల్‌ జట్టులో ఉన్నా చాలా కాలంగా పక్కనపెట్టారు. వీరి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక శ్రేయస్‌ని సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారని నమ్మకం ఏంటి?

అతడు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో రాణించాడు. దేశీ క్రికెట్‌లో సత్తా చాటాడు. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. అంతకంటే ముందు చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

సుదీర్ఘకాలం నిరీక్షణ తప్పకపోవచ్చు
అందుకే వన్డే జట్టులో చోటు దక్కించుకోగలడు. కానీ టెస్టుల విషయానికి వచ్చే సరికి... అతడి కంటే చాలా మంది ముందే ఉన్నారు. కాబట్టి అతడికి సుదీర్ఘకాలం నిరీక్షణ తప్పకపోవచ్చు’’ అని ఆకాశ్‌ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

కాగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో ముంబై తరఫున శ్రేయస్‌ అయ్యర్‌ రాణించాడు. ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 480 పరుగులు చేశాడు. కానీ సెలక్టర్లు మాత్రం అతడి వైపు చూడలేదు. తాజాగా ఇంగ్లండ్‌తో టీమిండియా సిరీస్‌ నేపథ్యంలో శ్రేయస్‌ గురించి అభిమానులు ప్రశ్నిస్తుండగా.. ఆకాశ్‌ చోప్రా పైవిధంగా స్పందించాడు.

ఇక ఇంగ్లండ్‌తో టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీ ఆడేందుకు అక్కడికి వెళ్లిన టీమిండియా.. తొలి టెస్టులో ఓటమిపాలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌ వేదికగా రెండో టెస్టు జరుగుతుంది. కాగా ఈ సిరీస్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ తన ప్రయాణాన్ని ఆరంభించాడు.

చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. చ‌రిత్ర‌కు అడుగు దూరంలో జైశ్వాల్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement