CT 2025: ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందింది.. విమర్శకులకు ఇచ్చిపడేసిన అశ్విన్‌ | Champions Trophy 2025: Ashwin Counters Indias Dubai Advantage | Sakshi
Sakshi News home page

CT 2025: ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందింది.. విమర్శకులకు ఇచ్చిపడేసిన అశ్విన్‌

Mar 8 2025 4:51 PM | Updated on Mar 8 2025 5:09 PM

Champions Trophy 2025: Ashwin Counters Indias Dubai Advantage

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి పాక్‌ ఆతిథ్యమిస్తున్నప్పటికీ.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. అయితే టీమిండియా తమ మ్యాచ్‌లను ఒకే వేదికపై ఆడటాన్ని కొందరు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఒకే వేదికపై మ్యాచ్‌లు ఆడటం​ వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణలపై భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందించాడు. ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందనడం సరికాదన్నాడు. గతంలో (2009 ఛాంపియన్స్‌ ట్రోఫీ) సౌతాఫ్రికా ఒకే వేదికపై అన్ని మ్యాచ్‌లు ఆడినా ఫైనల్‌కు చేరలేదన్న విషయాన్ని గుర్తు చేశాడు. బాగా ఆడితేనే టోర్నమెంట్లు గెలుస్తారని, సాకుల వల్ల కాదని చురకలంటించాడు. 

దుబాయ్‌లో ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని తమ కెప్టెన్‌, కోచ్‌లను ప్రశ్నించినప్పుడు నవ్వుకున్నానని అన్నాడు. టీమిండియా చివరిగా కోవిడ్‌కు ముందు 2018లో (ఆసియా కప్‌) దుబాయ్‌లో ఆడిందన్న విషయాన్ని గుర్తు చేశాడు. టీమిండియా తర్వాత న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా దుబాయ్‌లో ఆడాయని అన్నాడు. ప్రయాణించడం వల్ల ఆటగాళ్లు అలసిపోతారన్న విషయంతో ఏకీభవించిన అశ్విన్‌.. షెడ్యూల్‌ ఫిక్స్‌ చేయడంలో టీమిండియా ప్రమేయం ఉండదన్న విషయాన్ని గుర్తు చేశాడు. సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్‌ మిల్లర్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఈ విషయాన్ని ప్రస్తావించాడు.

ఎంతమంది ఎన్ని రకాలుగా టీమిండియాపై ఆరోపణలు (ఒకే వేదిక అంశం) చేసినా న్యూజిలాండ్‌ ఆటగాళ్లు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయరని కితాబునిచ్చాడు. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయకుండా కేవలం ఆటపై దృష్టి పెడుతుంది కాబట్టే న్యూజిలాండ్‌కు భారీ సంఖ్యలో అభిమానులున్నారని అన్నాడు. ఫైనల్లో గెలిచినా ఓడినా న్యూజిలాండ్ ఆటగాళ్లు హుందాగా ప్రవర్తిస్తారని తెలిపాడు.

కాగా, ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌ అదరగొడుతున్న విషయం తెలిసిందే. గ్రూప్‌ దశలో బంగ్లాదేశ్‌, పాక్‌, న్యూజిలాండ్‌పై విజయాలు సాధించిన భారత్‌.. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరింది. 

మరోవైపు న్యూజిలాండ్‌ గ్రూప్‌ దశలో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, భారత్‌ చేతిలో ఓడింది. అయినా గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో కివీస్‌ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. దుబాయ్‌ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే తుది సమరంలో న్యూజిలాండ్‌ రోహిత్‌ సేనతో అమీతుమీ తేల్చుకోనుంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌ భారత్‌ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్‌ ఫైనల్లో కివీస్‌ భారత్‌ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌కు అది తొలి ఐసీసీ టైటిల్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement