త్రిముఖ పోరు! ఆర్మూర్‌లో అనూహ్యంగా దూసుకొచ్చిన బీజేపీ.. | - | Sakshi
Sakshi News home page

త్రిముఖ పోరు! ఆర్మూర్‌లో అనూహ్యంగా దూసుకొచ్చిన బీజేపీ..

Nov 25 2023 1:24 AM | Updated on Nov 25 2023 8:55 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ హోరాహోరీగా తలపడుతుండగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మాత్రం త్రిముఖ పోరు నడుస్తోంది. మూడు పార్టీలు తగ్గేదేలే అన్నట్లుగా బరిలో సమరోత్సాహం ప్రదర్శిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బరిలోకి దిగగా వారిద్దరికీ దీటుగా బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపు తనదేనంటూ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దీంతో గెలుపు ఎవరిదన్నది అంతుపట్టని విధంగా తయారైంది. మూడు పార్టీల ఎత్తులు, పై ఎత్తులు, జాతీ య అగ్రనేతల పర్యటనలతో కామారెడ్డిలో రాజకీయం రసవత్తరంగా మారింది.

► నిజామాబాద్‌ అర్బన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ, బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణ మధ్య పోటాపోటీ నెలకొంది.
► బాల్కొండలో బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, కాంగ్రెస్‌ నుంచి ముత్యాల సునీల్‌రెడ్డి హోరాహోరీగా తలపడుతున్నారు. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.
► ఆర్మూర్‌ నియోజకవర్గంలో మొదట్లో కాంగ్రెస్‌కు మంచి సానుకూలత ఉన్నప్పటికీ అభ్యర్థి వినయ్‌రె డ్డి స్పీడ్‌ తగ్గడంతో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రా కేశ్‌రెడ్డి ముందుకు వచ్చారు. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ అ భ్యర్థి జీవన్‌రెడ్డి సైతం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
► బోధన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, సిట్టింగ్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి షకీల్‌, బీజేపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి మధ్య త్రిముఖ పోటీ నడుస్తోంది.
► నిజామాబాద్‌ రూరల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి భూపతిరెడ్డి మధ్య నువ్వా నేనా అనేలా పోటీ నడుస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కులాచారి దినేశ్‌ నామమాత్రంగా పోటీలో ఉన్నారు. ఆయన డిచ్‌పల్లి మండలంలో మాత్రమే ప్రభావం చూపిస్తున్నారు.
► బాన్సువాడలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, స్పీకర్‌ పోచా రం శ్రీనివాసరెడ్డి మంచి జోష్‌మీద ఉన్నారు. బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ మున్నూరుకాపు కావడంతో కలిసి వస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డికి సెటిలర్స్‌ మద్దతుతో బలం పెరిగినప్పటికీ, ఆయనపై దళితుల భూముల కబ్జా ఆరోపణలు ఉండడంతో ప్రభావం చూపిస్తోంది.
► ఎల్లారెడ్డిలో సిట్టింగ్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురేందర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌, బీజేపీ అభ్యర్థి సుభాష్‌రెడ్డి మధ్య త్రిముఖ పోరు నెలకొంది.
► జుక్కల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హ న్మంత్‌సింధే, కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మీకాంతరావు, బీజే పీ అభ్యర్థి అరుణతార మధ్య పోటాపోటి నెలకొంది.
ఇవి చదవండి: చిట్టా విప్పాల్సిందే..! లేదంటే న్యాయపరమైన చిక్కులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement