ఢిల్లీ మృత్యుకేళి: ప్రాణాల కోసం పై నుంచి దూకారు..! | Delhi Malviya Nagar Restaurant Fire Accident: Women Jump Video Viral | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మృత్యుకేళి: ప్రాణాల కోసం పై నుంచి దూకారు..!

Jun 3 2026 1:39 PM | Updated on Jun 3 2026 1:58 PM

Delhi Malviya Nagar Restaurant Fire Accident: Women Jump Video Viral

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో బుధవారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. హౌజ్‌రాణి ఏరియాలోని ఓ హోటల్‌లో భారీగా మంటలు చెలరేగడంతో 21 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా.. 40 మందికిపైగా సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్నవాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. ప్రమాద సమయంలో హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు నెట్టింటకు చేరాయి.

మంటలు వేగంగా వ్యాపించడంతో రెస్టారెంట్‌ అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో లోపల చిక్కుకున్న అతిథులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు భవనం పైఅంతస్తుల నుంచి కిందకు దూకిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో ఓ విదేశీయుడు, ఓ మహిళ ఉన్నారు. వాళ్ల పరిస్థితి ఏంటన్నది తెలియరావడం లేదు. మరికొందరు కూడా ప్రాణాలు అరచేత పట్టుకుని భవనం నుంచి బయటపడే ప్రయత్నాలు చేశారు. వాళ్లలో విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. కింద నిల్చున్న స్థానికులు తమ ఫోన్లలో ఆ దృశ్యాలు బంధించారు.

ఉదయం సుమారు 9 గంటల సమయంలో అగ్నిప్రమాద సమాచారం అందడంతో ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పది కంటే ఎక్కువ ఫైర్‌ ఇంజిన్లు, ప్రత్యేక రక్షణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. పొగతో నిండిపోయిన భవనంలోకి ప్రవేశించి చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు.

నిబంధనలకు విరుద్ధంగా..!
ఈ ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ 'బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్‌' పథకం కింద కేవలం ఆరు గదులు నిర్వహించేందుకు మాత్రమే అనుమతి పొందిన లెమన్‌ గ్రీన్‌ హోటల్‌.. నిబంధనలకు విరుద్ధంగా 25 గదులు నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. బేస్‌మెంట్‌లో కూడా గదులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో భవన భద్రతా ప్రమాణాలు, అనుమతుల ఉల్లంఘనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హోటల్‌ యాజమాన్యం అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించిందా? అనుమతులకు మించి కార్యకలాపాలు నిర్వహించిందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: ఢిల్లీ ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

Advertisement
 
Advertisement
Advertisement