ట్రిపుల్‌ ట్రీట్‌.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో.. | Tollywood Triple Treat: F4, Tillu 3, Hit 3, Arya 3, Mathu Vadalara 3 and many more Movies Coming | Sakshi
Sakshi News home page

Tollywood: సూపర్‌ హిట్‌ సినిమాలకు మూడో భాగాలు వచ్చేస్తున్నాయ్‌

Apr 18 2025 10:25 AM | Updated on Apr 18 2025 1:48 PM

Tollywood Triple Treat: F4, Tillu 3, Hit 3, Arya 3, Mathu Vadalara 3 and many more Movies Coming

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్‌ నడుస్తుంటుంది. ప్రస్తుతం సీక్వెల్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే హిట్‌ అయిన కథలకు కొనసాగింపుగా రెండు లేదా మూడు భాగాలుగా సినిమా తీయడానికి, అదేవిధంగా ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పడానికి ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్‌. పైగా సీక్వెల్స్‌ చిత్రాలకు అటు ప్రేక్షకుల్లో ఇటు ట్రేడ్‌ వర్గాల్లో ఫుల్‌ క్రేజ్‌ ఉండటంతో బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు ఫుల్‌గా ఉంటున్నాయి.

దీంతో సీక్వెల్స్‌ తీయడానికి దర్శక–నిర్మాతలు, హీరోలు ఏమాత్రం ఆలోచించకుండా సై అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు మూడో భాగంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండగా, మరికొన్ని చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అదే విధంగా ఇంకొన్ని సినిమాలకు మూడో భాగం ఉంటుందని ప్రకటించారు మేకర్స్‌. ‘ట్రిపుల్‌ ట్రీట్‌’ అంటూ ముచ్చటగా మూడో భాగంతో రానున్న ఆ సీక్వెల్స్‌ విశేషాలేంటో చూద్దాం.  

పుష్పరాజ్‌... తగ్గేదే లే 


హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun), డైరెక్టర్‌ సుకుమార్‌లది హిట్‌ కాంబినేషన్‌ . వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘ఆర్య’ (2004) సూపర్‌ హిట్‌ సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆర్య 2’ (2009) కూడా విజయం సాధించింది. దాదాపు పన్నెండేళ్ల గ్యాప్‌ అనంతరం వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’. రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై పాన్‌ ఇండియా హిట్‌గా నిలిచింది. 

పుష్పరాజ్‌గా తన నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్‌. ‘పుష్ప: ది రైజ్‌’కి సీక్వెల్‌గా ఇదే కాంబోలో వచ్చిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్‌’. తొలి భాగం సూపర్‌ హిట్‌ కావడంతో రెండో భాగంపై అంచనాలు తారస్థాయిలో ఉండేవి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గేదే లే అంటూ బ్లాక్‌బస్టర్‌ అందుకుంది ‘పుష్ప 2: ది రూల్‌’. 2024 డిసెంబరు 5న రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1800 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక ఈ సీక్వెల్‌లో మూడో భాగం ఉంటుందని ‘పుష్ప 2: ది రూల్‌’ ప్రమోషన్స్‌లో హీరో అల్లు అర్జున్, డైరెక్టర్‌ సుకుమార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మూడో భాగానికి ‘పుష్ప: ది రోర్‌’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారనే వార్తలు వినిపించాయి. అదేవిధంగా అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలకు సీక్వెల్‌గా ‘ఆర్య 3’ మూవీ ఉంటుందట. ఈ విషయాన్ని కూడా సుకుమార్‌ ఓ సందర్భంలో చెప్పారు. అయితే అల్లు అర్జున్‌ ప్రస్తుతం దర్శకులు త్రివిక్రమ్, అట్లీ సినిమాలు కమిట్‌ అయ్యారు. ఆ రెండు సినిమాల తర్వాతే సుకుమార్‌ కాంబినేషన్‌లో మూవీ ఉంటుందని ఊహించవచ్చు. మరి ‘పుష్ప’ మూడో భాగం, ‘ఆర్య 3’.. ఈ రెండిట్లో ఏది ముందుగా సెట్స్‌పైకి వెళుతుందనేది తెలియాలంటే చాలా సమయం పట్టవచ్చని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.  

అర్జున్‌ సర్కార్‌ వస్తున్నాడు


‘క్రిమినల్స్‌ ఉంటే భూమ్మీద పదడుగుల సెల్‌లో ఉండాలి... లేకుంటే భూమిలో ఆరడుగుల గుంతలో ఉండాలి’, ‘జనాల మధ్య ఉంటే అర్జున్‌... మృగాల మధ్య ఉంటే సర్కార్‌’ అంటున్నారు నాని (Nani). ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’. విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’ (2020), అడివి శేష్‌ హీరోగా నటించిన ‘హిట్‌: ది సెకండ్‌ కేస్‌’ (2022) వంటి హిట్‌ చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’. తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన శైలేష్‌ కొలను (Sailesh Kolanu) మూడో భాగాన్ని కూడా తెరకెక్కించారు. తొలి రెండు భాగాలను వాల్‌ పోస్టర్‌ సినిమాపై నిర్మించిన నాని ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’లో హీరోగా నటించడం విశేషం. 

ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటించారు. యునానిమస్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్‌పోస్టర్‌ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో అర్జున్‌ సర్కార్‌ అనే పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నాని కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో తొలి, మలి భాగాల్లానే మూడో భాగంతోనూ హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుంటామనే బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్‌. కాగా ‘హిట్‌’ ఫ్రాంచైజీలో మొత్తం ఏడు భాగాలు ఉంటాయని డైరెక్టర్‌ శైలేష్‌ కొలను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  

నాలుగురెట్ల నవ్వులు   


హీరో వెంకటేశ్, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)లది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. వీరి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా ఈ జనవరి 14న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి వెంకటేశ్‌ కెరీర్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే.. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్‌ చిత్రం ‘ఎఫ్‌ 2: ఫన్‌  అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’. 2019 జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో నవ్వులు పూయించడంతో పాటు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. 

‘ఎఫ్‌ 2’ కాంబినేషన్‌లోనే ఆ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘ఎఫ్‌ 3: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’. 2022 మే 27న విడుదలైన ‘ఎఫ్‌ 3’ కూడా మంచి విజయం సాధించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన తొలి, ద్వితీయ భాగాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. కాగా ఈ ఫ్రాంచైజీలో ‘ఎఫ్‌–4’ మూవీ ఉంటుందని ‘ఎఫ్‌ 3’ చిత్రం ఎండింగ్‌లో ప్రకటించారు మేకర్స్‌. అయితే ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కలేదు. కానీ, ఈ గ్యాప్‌లో వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్‌ హిట్‌ అందుకుంది.

ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘మెగా 157’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు అనిల్‌ రావిపూడి. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. ఈ సినిమా తర్వాతే ‘ఎఫ్‌ 4’ సెట్స్‌కి వెళ్లే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ‘ఎఫ్‌–2’, ‘ఎఫ్‌–3’లతో పోలిస్తే ‘ఎఫ్‌ –4’లో నవ్వులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయట. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌తో పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని సమాచారం. మరి... ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టేదెప్పుడో తెలియాలంటే వేచి చూడాలి. 

ఓదెల 3  


హీరోయిన్‌ తమన్నా (Tamannaah Bhatia) లీడ్‌ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్‌.సింహా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అశోక్‌ తేజ ద్వితీయ భాగానికి కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి డైరెక్టర్‌ సంపత్‌ నంది కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. 

మధు క్రియేషన్స్‌, సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌పై డి.మధు నిర్మించిన ఈ మూవీ గురువారం (ఏప్రిల్‌ 17న) విడుదలైంది. తొలిసారి నాగసాధువు భైరవి పాత్రలో తమన్నా నటించారు. ప్రేతాత్మ తిరుపతిగా వశిష్ఠ నటించారు. ఈ మూవీలో తమన్నా నటన హైలైట్‌గా నిలిచింది. ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ ఓటీటీలో విడుదలైనా మంచి హిట్‌గా నిలవడంతో ‘ఓదెల 2’పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ నెలకొంది. కాగా ఈ సినిమాకి కొనసాగింపుగా ‘ఓదెల 3’ ఉంటుందని చిత్రయూనిట్‌ ప్రకటించడం విశేషం.

తొలి, మలి భాగాలకు మించి...   


హీరో నిఖిల్‌ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటిలది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ అనే చెప్పాలి. వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘కార్తికేయ’ (2014) సూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన  ‘కార్తికేయ 2’ 2022 ఆగస్టు 13న విడుదలై పాన్‌ ఇండియా హిట్‌ అందుకుంది. అంతేకాదు... రూ. 100కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడం విశేషం. ఈ కోవలోనే ‘కార్తికేయ 3’ ఉంటుందని దర్శకుడు చందు మొండేటి, నిఖిల్‌ సిద్ధార్థ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

‘కార్తికేయ, కార్తికేయ 2’ సూపర్‌ హిట్స్‌ కావడంతో ‘కార్తికేయ 3’పై అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, క్రేజ్‌ నెలకొన్నాయి. అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీ తొలి, ద్వితీయ భాగాలకు మించి అద్భుతంగా ఉంటుందని మేకర్స్‌ నమ్మకంగా ఉన్నారు. నాగచైతన్య హీరోగా ‘తండేల్‌’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న చందు మొండేటి ప్రస్తుతం ‘కార్తికేయ 3’కి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌పై పని చేస్తున్నారు. అదేవిధంగా నిఖిల్‌ ప్రస్తుతం ‘స్వయంభూ’ సినిమా చేస్తున్నారు. మరి ‘కార్తికేయ 3’ పట్టాలెక్కే సమయం ఎప్పుడు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.  

టిల్లు క్యూబ్‌


‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌’ చిత్రాలతో ప్రేక్షకులను తనదైన యాటిట్యూడ్, మేనరిజమ్‌తో నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ ఫ్రాంచైజీలో రూపొందనున్న మూడో చిత్రం ‘టిల్లు క్యూబ్‌’. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’. 2024 మార్చి 29న రిలీజైన ఈ మూవీ తొలి భాగం మంచి హిట్‌గా నిలిచింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ రూ.వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సిద్ధు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. 

ఇక ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్‌’ సినిమా తెరకెక్కనున్నట్లు యూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి తొలి, మలి భాగాలకు దర్శకత్వం వహించిన విమల్‌ కృష్ణ, మల్లిక్‌ రామ్‌ కాకుండా కల్యాణ్‌ శంకర్‌(మ్యాడ్‌ ఫేమ్‌) దర్శకత్వం వహించనుండటం విశేషం. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు... ‘టిల్లు క్యూబ్‌’లో హీరో పాత్రను సూపర్‌ హీరోగా చూపించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ‘టిల్లు క్యూబ్‌’ చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలున్నాయి.  

మూడో పొలిమేరలో... 


‘సత్యం’ రాజేశ్‌ కీలక పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర’ (2021), ‘మా ఊరి పొలిమేర 2’ (2023) సినిమాలు మంచి విజయం సాధించాయి. చేతబడి నేపథ్యంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు హిట్‌ అయ్యాయి. కాగా ఈ ఫ్రాంచైజీలో 'పొలిమేర 3’ (Polimera 3 Movie) రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తొలి, మలి భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్‌ విశ్వనాథ్‌ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ‘సత్యం’ రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌ మెంట్‌ బ్యానర్‌పై  భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి నిర్మిస్తున్నారు. చిత్రయూనిట్‌ విడుదల చేసిన ‘పొలిమేర 3’ వీడియో గ్లింప్స్‌ చూస్తే మొదటి, ద్వితీయ భాగంతో పోలిస్తే ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు మరిన్ని ఉంటాయని తెలుస్తోంది.

మూడోసారి మత్తు వదలరా...  
‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా 2’ చిత్రాల ఫ్రాంచైజీలో రూపొందనున్న చిత్రం ‘మత్తు వదలరా 3’. శ్రీ సింహా కోడూరి, నరేశ్‌ అగస్త్య, సత్య లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్‌ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019లో విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. తొలి భాగాన్ని తెరకెక్కించిన రితేష్‌ రానా రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించారు. 

శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెంబరు 13న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ ఫ్రాంచైజీలో ‘మత్తు వదలరా 3’ కూడా ఉంటుందని ప్రకటించింది చిత్రయూనిట్‌. అయితే వెంటనే షూటింగ్‌ ఉండదని దర్శకుడు రితేష్‌ రానా ప్రకటించారు. మరి ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

నవ్వులు మూడింతలు  


సంగీత్‌ శోభన్, నార్నె నితిన్, రామ్‌ నితిన్‌ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్‌’. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం 2023 అక్టోబరు 6న రిలీజై ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ‘మ్యాడ్‌’ కాంబినేషన్‌లోనే ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’. తొలి భాగం హిట్‌తో ద్వితీయ భాగంపై అంచనాలు నెలకొన్నాయి. 

ఈ మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సక్సెస్‌మీట్‌కి హీరో ఎన్టీఆర్‌ రావడం విశేషం. కాగా ‘మ్యాడ్‌’, ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ చిత్రాలకు సీక్వెల్‌గా ‘మ్యాడ్‌ 3’ కచ్చితంగా ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. అయినప్పటికీ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు సమయం పడుతుందని స్పష్టం చేశారు. పై సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా మూడో భాగం రానున్నాయి.

చదవండి: నలుగురికిపైగా హీరోయిన్లు.. అందులో తమన్నా కూడా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement