
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టాలీవుడ్లోనూ ఫుల్ ఫేమస్ అయింది. డాకు మహారాజ్ తర్వతా మరింత క్రేజ్ దక్కించుకుంది. ఇటీవల రిలీజైన సన్నీ డియోల్ మూవీ జాట్లో ఓ ఐటమ్ సాంగ్లో మెరిసింది. ఎప్పుడు వార్తల్లో నిలిచి ఈ ముద్దుగుమ్మ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఈ సారి ఏకంగా తనకు గుడి కట్టారంటూ కామెంట్స్ చేసింది. ఉత్తరాఖండ్లో నాకు ఓ గుడి కట్టారు. బద్రీనాథ్కు దగ్గర్లోనే ఊర్వశి దేవాలయం ఉంది. జనాలు అక్కడికి వెళ్లి నా ఆశీర్వాదం తీసుకుంటారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు నన్ను భక్తిగా పూజ చేసి నా ఫోటోకు దండలు కూడా వేస్తారని చెప్పుకొచ్చింది. నన్ను ఆ గుడిలో దండమామై అని పిలుస్తుంటారని కూడా తెలిపింది. బద్రీనాథ్కు ఎవరైనా వెళ్తే పక్కనే ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి అంటూ సలహా కూడా ఇచ్చింది.
తాజాగా ఆమె వ్యాఖ్యలపై స్థానికి పూజారులు స్పందించారు. ఊర్వశి రౌతేలా చేసిన కామెంట్స్పై మండిపడుతున్నారు. ఊర్వశి రౌతేలా వాదన అందరినీ తప్పుదారి పట్టించేలా ఉందని పూజారి భువన్ చంద్ర ఉనియాల్ అన్నారు. బద్రినాథ్ సమీపంలోని బామ్నిలో ఊర్వశీ పేరుతో ఆలయం ఉన్న మాట వాస్తవమేనని.. కానీ ఆలయంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆమె వ్యాఖ్యలతో స్థానిక పూజారులు, మత అధికారులు, బద్రీనాథ్ నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆమె గుడి కాదు. ఇలాంటి ప్రకటనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఊర్వశీ వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. ఇది మత విశ్వాసాలను అగౌరవపరచడమే అని బ్రహ్మకపాల్ తీర్థ్ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ మండిపడ్డారు.
(ఇది చదవండి: బద్రీనాథ్ పక్కనే నా పేరుపై గుడి.. నాకు పూజలు, పూలదండలు: ఊర్వశి)
బద్రీనాథ్ ధామ్ సమీపంలోని బామ్నిలో ఉన్న ఊర్వశి ఆలయం.. పురాణాల ప్రకారం సతీదేవి శరీరం భాగాలు పడిపోయిన ప్రదేశం నుంచి ఉద్భవించిందని విశ్వసిస్తున్నారు. ఈ పవిత్రమైన ఆలయాన్ని ఊర్వశి దేవికి అంకితం చేశారని చెబుతున్నారు. ఊర్వశి దేవాలయం హిందూ పురాణాలలో సతీదేవితో ముడిపడి ఉందని అంటున్నారు. ఈ ఆలయం 108 శక్తిపీఠాలలో భాగంగా పరిగణించబడుతుందని ఆయన స్పష్టం చేశారు. వారి సంప్రదాయంలో భాగంగా పూజించే బామ్ని, పాండుకేశ్వర్ గ్రామాల నివాసితుల ఆధ్యాత్మిక ఆలయంంగా అనుసంధానించబడి ఉందని ఆయన తెలిపారు. బ్రహ్మ కపాల్ తీర్థ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ సతీ కూడా రౌతేలా వ్యాఖ్యలను ఖండించారు. ఈ ఆలయం పురాతనమైనదని.. ఊర్వశి దేవితో ముడిపడి ఉందని.. ఏ వ్యక్తితోనూ కాదని తెలిపారు. ఇలాంటి ప్రకటనలు ఇక్కడి ప్రజల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అన్నారు. ఊర్వశి రౌతేలాపై స్థానికులైన బామ్ని, పాండుకేశ్వర్ గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.