దర్శకుడు పూరీ జగన్నాథ్ దేవుడిని పెద్దగా నమ్మడు! ఇదే విషయాన్ని మ్యూజింగ్స్, పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఈయన కూతురు పవిత్ర మాత్రం శివుడిపై భక్తిభావన పెంచుకుంటోంది. అందుకు తగ్గట్లే తనకు కలలో శివుడు కనిపించాడని, ఇది సాధారణంగా అనిపించలేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: అక్కకు పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా: హీరోయిన్)
'కొన్నేళ్ల క్రితం ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే పెన్తో మండల చిత్రాలు గీయడం ప్రారంభించాను. ఇది నేర్చుకున్న నైపుణ్యం కాదు. సహజంగా పుట్టుకొచ్చిన ఓ అభిరుచి. కాలక్రమేణా ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఓ భాగమైంది. శివుడు నా జీవితంలో దేవుడు మాత్రమే కాదు. నా బలం, నా ఓదార్పు. నా మనసు ఆనందంతో నిండినప్పుడు, బాధపడినప్పుడు నేను మాట్లాడుకునేది ఆయనతోనే. గతేడాది కేదార్నాథ్ ఆలయానికి సంబంధించిన ఓ అందమైన కల వచ్చింది. అది సాధారణమైన కలలా అనిపించలేదు. శివుడే నన్ను పిలుస్తున్నట్లుగా అనిపించింది. తర్వాతి రోజే కేదార్నాథ్ ఆలయాన్ని మండల ఆర్ట్ శైలిలో గీయడం ప్రారంభించాను'
'దాదాపు వారం రోజుల పాటు ప్రతి గీతలోనూ ఓ ప్రార్థన, ప్రతి ఆకృతిలోనూ ఓ భావాన్ని, ప్రతి రంగులోనూ నా భక్తిని నింపుతూ ఆ చిత్రాన్ని గీయడం పూర్తి చేశాను. దీనిని ఒక వారం పాటు గీసినప్పటికీ చాలా కాలంగా గీస్తున్నట్టుగా అనిపించింది. ఇది పూర్తయిన తర్వాత నాలో ఓ ప్రశాంతత నెలకొంది. దీనిని మొదట నా కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకున్నా. కానీ ఇప్పుడు కృతజ్ఞతతో ఆ చిత్రాన్ని అందరితో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. హర హర మహాదేవ్' అని పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర రాసుకొచ్చింది.
(ఇదీ చదవండి: 'ఇరుముడి' సినిమాకు శబరిమలతో సంబంధం లేదు)


