దురహంకారంతో తప్పులు చేశాడు | Gangster Goldy Brar makes BIG statement on pop singer Sidhu Moose Wala | Sakshi
Sakshi News home page

దురహంకారంతో తప్పులు చేశాడు

Jun 12 2025 5:32 AM | Updated on Jun 12 2025 5:32 AM

Gangster Goldy Brar makes BIG statement on pop singer Sidhu Moose Wala

సిద్ధూ మూసేవాలాను అందుకే చంపాం

పంజాబ్‌ గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ వెల్లడి

వాషింగ్టన్‌: మూడు సంవత్సరాల క్రితం పంజాబ్‌కు చెందిన యువ పాప్‌సింగర్‌ సిద్ధూ మూసేవాలాపైకి తూటాల వర్షం కురిపించి చంపేసిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ ఆచూకీ ఇంతవరకు తెలీదు. కానీ బీబీసీ వార్తాసంస్థ ఎట్టకేలకు తాజాగా అతడిని ఇంటర్వ్యూ చేసింది. మూసేవాలాను అంతమొందించడానికి గల కారణాలను రాబట్టింది. దీనిపై గోల్డీబ్రార్‌ సూటిగా, సుదీర్ఘంగ మాట్లాడారు. 

‘‘ దురహంకారంతో సిద్ధూ క్షమించలేనంతగా కొన్ని తప్పులు చేశాడు. ఇక అతడిని చంపడం మినహా మాకు మరో మార్గం కనిపించలేదు. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. అది అతడైనాసరే మేమైనాసరే’’ అని గోల్డీ అన్నాడు. కెనడాలో ఉంటూ గోల్డీబ్రార్‌ ఈ హత్యకు పథకరచన చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్‌కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్, గోల్డీ కలిసి ఎన్నో నేరాలు చేశారు. 

ప్రస్తుతం బిష్ణోయ్‌ జైలులో ఉన్నాడు. ‘‘సిద్ధూ మ్యూజిక్‌ అంటే బిష్ణోయ్‌కు ఇష్టం. 2018 ఏడాది తొలినాళ్లలో సిద్ధూ కెనడాలో ఇంజనీరింగ్‌ చదవడానికి వచ్చి మ్యూజిక్‌పై మమకారంతో మంచి పాప్‌సింగర్‌గా ఎదిగాడు. అప్పుడే సిద్ధూకు బిష్ణోయ్‌తో పరియం ఏర్పడింది. రోజూ గుడ్‌ మార్నింగ్, గుడ్‌నైట్‌ మెసేజ్‌లు బిష్ణోయ్‌కు సిద్ధూ చేసేవాడు. సిద్ధూ భారత్‌కు వచ్చిన తర్వాతే భేదాభిప్రాయాలు మొదలయ్యాయి’’ అని అన్నాడు.

కబడ్డీతో మొదలై...
‘‘మా సొంత రాష్ట్రంలో ప్రఖ్యాత కబడ్డీ ఆటల పోటీలకు సిద్దూ ఆర్థికసాయం చేశాడు. వాస్తవానికి ఆ పోటీలను బిష్ణోయ్‌ బద్ధశత్రువులైన బామ్‌బిహా గ్యాంగ్‌ నిర్వహించింది. మా శత్రువులకు చెందిన గ్రామం నుంచి బామ్‌బిహా గ్యాంగ్‌కు చెందిన ఆటగాళ్లు వచ్చి ఆనాడు పోటీల్లో పాల్గొన్నారు. శత్రువులు నిర్వహించిన పోటీలకు సిద్ధూ స్పాన్సర్‌గా ఉండటం బిష్ణోయ్, అతని గ్యాంగ్‌కు అస్సలు నచ్చలేదు. అయితే బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో సభ్యుడైన విక్కీ మిధుఖేరా అనే వ్యక్తి తర్వాత బిష్ణోయ్, సిద్దూల మధ్య సయోధ్య కుదిర్చాడు. అయితే ఈ విక్కీని 2021 ఆగస్ట్‌లో మొహాలీ సిటీలో కొందరు కాల్చిచంపారు. 

విక్కీని చంపింది తామేనని బామ్‌బిహా గ్యాంగ్‌ ప్రకటించుకుంది. సిద్ధూ స్నేహితుడు, అతని ఒకప్పటి మేనేజర్‌ శగన్‌ప్రీత్‌ సింగ్‌ పేరును విక్కీ హత్య కేసు చార్జ్‌షీటులో పోలీసులు ప్రస్తావించారు. దీంతో విక్కీ హత్య వెనుక సిద్ధూ హస్తముందని మేం భావించాం. విక్కీని చంపేందుకు హంతకులకు శగన్‌ప్రీత్‌ అన్ని రకాలుగా సాయంచేశాడు. తర్వాత శగన్‌ ఆస్ట్రేలియాకు పారిపోయాడు. ఆ తర్వాత కూడా శగన్‌తో సిద్దూ స్నేహం కొనసాగింది. వద్దని మేం వారించినా వినలేదు. దాంతో సిద్ధూతో మా శత్రుత్వం అమాంతం పెరిగిపోయింది. రాజకీయనేతలతో, అధికారంలో ఉన్న పార్టీలతో సిద్ధూకు సత్సంబంధాలున్నాయి.

 మా శత్రువులు బలోపేతం కావడానికి సిద్ధూ తన రాజకీయ పలుకుబడి, డబ్బును ఉపయోగించాడు. సిద్ధూ తప్పులకు శిక్ష పడాలని మేం భావించాం. కేసు నమోదుచేసి జైళ్లో పడేయాలని వాదించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. పద్దతిగా చెబితే విననప్పుడు తూటాల శబ్దాలైనా వింటారేమో. అందుకే తుపాకీ మోత మోగించాం’’ అని గోల్డీబ్రార్‌ చెప్పాడు. భారత్‌లో చట్టాలు ఉన్నప్పుడు చట్టాన్ని మీరెందుకు మీ చేతుల్లోకి తీసుకున్నారు? అని ప్రశ్నించగా.. ‘‘ చట్టం. న్యాయం. ఇలాంటివి భారత్‌లో లేవు. 

కేవలం శక్తివంతమైన వ్యక్తులకు మాత్రమే అవి దక్కుతాయి. సాధారణ ప్రజలకు అవి అందని ద్రాక్షే’’ అని అన్నాడు. ‘‘ చనిపోయిన విక్కీ సోదరుడు రాజకీయాల్లో ఉండి కూడా తన సోదరుడిని హత్యచేసిన వాళ్లకు శిక్షపడేలా చేయలేకపోయాడు. కావాలంటే అతడితో మాట్లాడి చూడండి అతనెంతగా న్యాయబద్ధంగా పోరాడాడో. చనిపోయిన విక్కీ కోసం నేను ఈ పనిచేశా. సిద్దూను అంతంచేసినందుకు నాకు కాస్తంత పశ్చాత్తాపం కూడా లేదు’’ అని అన్నాడు.  రెండు గ్యాంగ్‌ల మధ్య తగాదాలో సిద్ధూ మృతికి కారణమని తెలిసినా స్పష్టమైన కారణాలు ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు. తొలిసారిగా గోల్డీబ్రారే ఈ అంశాలు వెల్లడించారని బీబీసీ తన కథనంలో పేర్కొంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement