breaking news
BBC interview
-
దురహంకారంతో తప్పులు చేశాడు
వాషింగ్టన్: మూడు సంవత్సరాల క్రితం పంజాబ్కు చెందిన యువ పాప్సింగర్ సిద్ధూ మూసేవాలాపైకి తూటాల వర్షం కురిపించి చంపేసిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ఆచూకీ ఇంతవరకు తెలీదు. కానీ బీబీసీ వార్తాసంస్థ ఎట్టకేలకు తాజాగా అతడిని ఇంటర్వ్యూ చేసింది. మూసేవాలాను అంతమొందించడానికి గల కారణాలను రాబట్టింది. దీనిపై గోల్డీబ్రార్ సూటిగా, సుదీర్ఘంగ మాట్లాడారు. ‘‘ దురహంకారంతో సిద్ధూ క్షమించలేనంతగా కొన్ని తప్పులు చేశాడు. ఇక అతడిని చంపడం మినహా మాకు మరో మార్గం కనిపించలేదు. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. అది అతడైనాసరే మేమైనాసరే’’ అని గోల్డీ అన్నాడు. కెనడాలో ఉంటూ గోల్డీబ్రార్ ఈ హత్యకు పథకరచన చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ కలిసి ఎన్నో నేరాలు చేశారు. ప్రస్తుతం బిష్ణోయ్ జైలులో ఉన్నాడు. ‘‘సిద్ధూ మ్యూజిక్ అంటే బిష్ణోయ్కు ఇష్టం. 2018 ఏడాది తొలినాళ్లలో సిద్ధూ కెనడాలో ఇంజనీరింగ్ చదవడానికి వచ్చి మ్యూజిక్పై మమకారంతో మంచి పాప్సింగర్గా ఎదిగాడు. అప్పుడే సిద్ధూకు బిష్ణోయ్తో పరియం ఏర్పడింది. రోజూ గుడ్ మార్నింగ్, గుడ్నైట్ మెసేజ్లు బిష్ణోయ్కు సిద్ధూ చేసేవాడు. సిద్ధూ భారత్కు వచ్చిన తర్వాతే భేదాభిప్రాయాలు మొదలయ్యాయి’’ అని అన్నాడు.కబడ్డీతో మొదలై...‘‘మా సొంత రాష్ట్రంలో ప్రఖ్యాత కబడ్డీ ఆటల పోటీలకు సిద్దూ ఆర్థికసాయం చేశాడు. వాస్తవానికి ఆ పోటీలను బిష్ణోయ్ బద్ధశత్రువులైన బామ్బిహా గ్యాంగ్ నిర్వహించింది. మా శత్రువులకు చెందిన గ్రామం నుంచి బామ్బిహా గ్యాంగ్కు చెందిన ఆటగాళ్లు వచ్చి ఆనాడు పోటీల్లో పాల్గొన్నారు. శత్రువులు నిర్వహించిన పోటీలకు సిద్ధూ స్పాన్సర్గా ఉండటం బిష్ణోయ్, అతని గ్యాంగ్కు అస్సలు నచ్చలేదు. అయితే బిష్ణోయ్ గ్యాంగ్లో సభ్యుడైన విక్కీ మిధుఖేరా అనే వ్యక్తి తర్వాత బిష్ణోయ్, సిద్దూల మధ్య సయోధ్య కుదిర్చాడు. అయితే ఈ విక్కీని 2021 ఆగస్ట్లో మొహాలీ సిటీలో కొందరు కాల్చిచంపారు. విక్కీని చంపింది తామేనని బామ్బిహా గ్యాంగ్ ప్రకటించుకుంది. సిద్ధూ స్నేహితుడు, అతని ఒకప్పటి మేనేజర్ శగన్ప్రీత్ సింగ్ పేరును విక్కీ హత్య కేసు చార్జ్షీటులో పోలీసులు ప్రస్తావించారు. దీంతో విక్కీ హత్య వెనుక సిద్ధూ హస్తముందని మేం భావించాం. విక్కీని చంపేందుకు హంతకులకు శగన్ప్రీత్ అన్ని రకాలుగా సాయంచేశాడు. తర్వాత శగన్ ఆస్ట్రేలియాకు పారిపోయాడు. ఆ తర్వాత కూడా శగన్తో సిద్దూ స్నేహం కొనసాగింది. వద్దని మేం వారించినా వినలేదు. దాంతో సిద్ధూతో మా శత్రుత్వం అమాంతం పెరిగిపోయింది. రాజకీయనేతలతో, అధికారంలో ఉన్న పార్టీలతో సిద్ధూకు సత్సంబంధాలున్నాయి. మా శత్రువులు బలోపేతం కావడానికి సిద్ధూ తన రాజకీయ పలుకుబడి, డబ్బును ఉపయోగించాడు. సిద్ధూ తప్పులకు శిక్ష పడాలని మేం భావించాం. కేసు నమోదుచేసి జైళ్లో పడేయాలని వాదించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. పద్దతిగా చెబితే విననప్పుడు తూటాల శబ్దాలైనా వింటారేమో. అందుకే తుపాకీ మోత మోగించాం’’ అని గోల్డీబ్రార్ చెప్పాడు. భారత్లో చట్టాలు ఉన్నప్పుడు చట్టాన్ని మీరెందుకు మీ చేతుల్లోకి తీసుకున్నారు? అని ప్రశ్నించగా.. ‘‘ చట్టం. న్యాయం. ఇలాంటివి భారత్లో లేవు. కేవలం శక్తివంతమైన వ్యక్తులకు మాత్రమే అవి దక్కుతాయి. సాధారణ ప్రజలకు అవి అందని ద్రాక్షే’’ అని అన్నాడు. ‘‘ చనిపోయిన విక్కీ సోదరుడు రాజకీయాల్లో ఉండి కూడా తన సోదరుడిని హత్యచేసిన వాళ్లకు శిక్షపడేలా చేయలేకపోయాడు. కావాలంటే అతడితో మాట్లాడి చూడండి అతనెంతగా న్యాయబద్ధంగా పోరాడాడో. చనిపోయిన విక్కీ కోసం నేను ఈ పనిచేశా. సిద్దూను అంతంచేసినందుకు నాకు కాస్తంత పశ్చాత్తాపం కూడా లేదు’’ అని అన్నాడు. రెండు గ్యాంగ్ల మధ్య తగాదాలో సిద్ధూ మృతికి కారణమని తెలిసినా స్పష్టమైన కారణాలు ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు. తొలిసారిగా గోల్డీబ్రారే ఈ అంశాలు వెల్లడించారని బీబీసీ తన కథనంలో పేర్కొంది. -
BioNTech: త్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్!
క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇక ఎంతో సమయం పట్టదని ఈ ప్రాణాంతక వ్యాధిపై సుదీర్ఘ కాలంగా పరిశోధన చేస్తున్న దంపతులు, ‘బయో ఎన్టెక్’ వ్యాక్సిన్ల తయారీ సంస్థ అధినేలు ప్రొఫెసర్ ఉగుర్ సాహిన్, ప్రొఫెసర్ ఓజ్లెమ్ టురేసి చెబుతున్నారు. మహా అయితే ఎనిమిదేళ్లలోపే క్యాన్సర్ వ్యాక్సిన్ వాడుకలోకి రాబోతోందని వివరించారు. ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ ఇంటర్వ్యూలో వారు ఈ మేరకు వెల్లడించారు. ‘‘మేం డాక్టర్లుగా బాధితుల వెతలు, నిరాశా నిస్పృహలు చూసి చలించిపోయేవాళ్లం. ఆ అనుభవమే క్యాన్సర్ పరిశోధనల వైపు మళ్లించింది’’ అన్నారు. ‘‘కరోనాకు మంచి వ్యాక్సిన్ తయారు చేస్తున్న క్రమంలో ఆ పరిశోధన అనుకోకుండా క్యాన్సర్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసేలా మలుపు తిరిగింది. ఇది మెసెంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికతతో రూపొందించిన వ్యాక్సిన్. మన ఒంట్లోని వ్యాధినిరోధక శక్తే క్యాన్సర్ కణాలను గుర్తించి తుదముట్టించేలా ఇది పని చేస్తుంది’’ అని డాక్టర్ సాహిన్ చెప్పారు. తమ వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని ఘంటాపథంగా చెప్పారు. అది క్యాన్సర్ కణాలను నేరుగా తుదముట్టించేలా రూపొందిందని టురేసి వివరించారు. ‘‘ట్రయల్స్లో బాధితులపై వ్యాక్సిన్ను వాడుతున్నప్పుడు ఎదురైన అడ్డంకులు దీన్ని మరింత ప్రభావవంతంగా మార్చేలా చేశాయి’’ అని దంపతులు చెప్పారు. ఈ పరిశోధనల వివరాలు తొలుత బిజినెస్ ఇన్సైడర్ మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. -
కశ్మీర్ ముస్లింల హక్కులపై మాట్లాడుతాం!
ఇస్లామాబాద్: కశ్మీర్ సహా ప్రపంచంలోని ముస్లింల హక్కుల కోసం గళమెత్తుతామని తాలిబన్లు ప్రకటించారు. ఒకపక్క భారత్తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని, కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోమంటూనే కశ్మీర్పై తాలిబన్లు కొత్త ప్రేలాపనలు మొదలుబెట్టారు. కశ్మీర్ సహా ఎక్కడ నివసించే ముస్లింల హక్కుల కోసమైనా మాట్లాడే హక్కు తమకుందని, అయితే ఏ దేశానికి వ్యతిరేకంగా సాయుధ చర్యలు చేపట్టే విధానం తమకు లేదని తాలిబన్లు వింత భాష్యాలు చెప్పారు. అఫ్గాన్ తిరిగి తాలిబన్ పాలనలోకి పోవడంతో భారత్కు ఉగ్రముప్పు పెరిగిందని ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సహా ప్రపంచంలో ఎక్కడ నివసించే ముస్లింల కోసమైనా మాట్లాడే హక్కు సాటి ముస్లింలుగా తమకుందన్నారు. ఇటీవలే ఖతార్లో భారత రాయబారితో భేటీ అయిన తాలిబన్లు..అఫ్గా్గన్ గడ్డను ఉగ్రనిలయంగా మార్చమంటూ హామీ ఇచ్చారు. కశ్మీర్ భారత అంతర్గత విషయమని, తాము జోక్యం చేసుకోబోమని గతంలో తాలిబన్లు చేసిన ప్రకటనతో తాజా ప్రకటన విభేదిస్తుండడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు భావిస్తున్నారు. అలాగే భారత వ్యతిరేక హక్కానీ నెట్వర్క్పై సైతం తాలిబన్ల స్వరం మారింది. హక్కానీలపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారాలని సుహైల్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. పంజ్ షీర్ తాలిబన్ల వశం! ఇన్నాళ్లూ తమకు ఎదురు నిలిచిన పంజ్ షీర్ లోయను సైతం స్వాధీనం చేసుకున్నామని, తద్వారా మొత్తం అఫ్గానిస్తాన్పై పూర్తి పట్టు సాధించామని తాలిబన్ కమాండర్ ఒకరు శుక్రవారం ప్రకటించారు. పంజ్ షీర్లోని తిరుగుబాటుదారులపై విజయం సాధించామని చెప్పారు. కీలకమైన పంజ్ షీర్ తమ వశం కావడంతో రాజధాని కాబూల్లో తాలిబన్లు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు. పంజ్ షీర్ను ఆక్రమించినట్లు తాలిబన్లు చెబుతున్నప్పటికీ అధికారికంగా ఇది ఇంకా నిర్ధారణ కాలేదు. పునర్నిర్మాణానికి చైనా సాయం చైనా తమకు అత్యంత కీలక భాగస్వామి అని, అఫ్గాన్ పునరి్నర్మాణానికి చైనా సాయం తీసుకుంటామని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు. అఫ్గాన్లోని ఖనిజ నిక్షేపాలు వెలికితీసి దేశానికి ఆర్థిక ఆసరా అందించేందుకు చైనా సహాయం అందిస్తుందన్నారు. చైనా ప్రతిపాదిత వన్బెల్ట్, వన్ రోడ్ను సమర్థి్ధస్తున్నామన్నారు. కొత్త ప్రభుత్వంపై నేడు ప్రకటన పెషావర్: అఫ్గానిస్తాన్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు తమ ప్రకటనను ఒకరోజు వాయిదా వేశారు. శనివారం తమ నిర్ణయాన్ని వెల్ల డిస్తామని చెప్పారు. కొత్త సర్కారు అధినేతగా ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ పేరు తెరపైకి వచ్చింది. తాలిబన్ ముఠా సహ వ్యవస్థాపకుడైన బరాదర్ ప్రస్తుతం దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయ చైర్మన్గా ఉన్నాడు. అఫ్గానిస్తాన్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణపై గత ఏడాది అమెరికాతో జరిగిన చర్చల్లో కీలకంగా వ్యవహరించాడు. ప్రమాదంలో మహిళా జడ్జీలు కాబూల్: తాలిబన్ల రాకతో అఫ్గానిస్తాన్లో మహిళా జడ్జీల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న పలువురు నేరస్తులను ఇటీవల తాలిబన్లు విడిపించారు. దీంతో తమకు శిక్ష విధించిన మహిళా జడ్జీలపై ప్రతీకారం తీర్చుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. జనవరిలోనే తాలిబన్లు ఇద్దరు మహిళా న్యాయమూర్తులను కాల్చి చంపారు. ఇలా ప్రమాదం అంచుల్లో ఉన్న మహిళా జడ్జీల సంఖ్య 250 వరకూ ఉంది. తాలిబన్లు అఫ్గాన్ను హస్తగతం చేసుకోగానే కొందరు దేశాన్ని వదిలి వెళ్లిపోగా పరిస్థితులు అనుకూలించక కొందరు ఇక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు వారి ఇళ్లకు వెళ్లి తమకు శిక్ష విధించిన మహిళా జడ్జి ఎక్కడ అని ప్రశ్నిస్తున్నట్లు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ విమెన్ జడ్జెస్ (ఐఏడబ్ల్యూజే) సభ్యులు తెలిపారు. విడుదలతోనే ప్రమాదం.. దోషులను తాలిబన్లు విడుదల చేయడంతోనే అసలు ప్రమాదం ప్రారంభమైందని అఫ్గాన్ నుంచి యూరోప్కు వెళ్లిన ఓ మహిళా జడ్జి చెప్పారు. జడ్జిలేగాక సామాజిక కార్యకర్తలైన మహిళలకు సైతం ముప్పు పొంచి ఉందని వివరించారు. ‘మిమ్మల్ని వెంటాడి తీరుతాం’ అని తాలిబన్లు ఇప్పటికే మహిళా పోలీసు ఆఫీసర్లకు సందేశాలు పంపినట్లు వెల్లడించారు. తమ హక్కులను కాపాడాలంటూ అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో మహిళల ర్యాలీ -
ఆఖరిసారి అప్పుడే ఏడ్చాను: సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఏడాదిన్నరకు పైగా ప్రపంచ దేశాలను వణికిస్తుంది. కోవిడ్కు అంతమెన్నడో తెలియడం లేదు.. రెండు వేవ్లతో సతమతమైన జనాలపై మూడో వేవ్ విరుచుకుపడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఓ విధంగా కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారంటే అతిశయోక్తి కాదు. కుబేరులు, పేదలు, ప్రముఖులు, సామాన్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధ పెట్టింది కోవిడ్. ఈ జాబితాలో తాను కూడా ఉన్నాను అంటున్నారు గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్. మహమ్మారి తనను కూడా మానసికంగా బాధించిందన్నారు. బీబీసీకిచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో ఆయన ‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇంటర్నెట్’పై దాడితో సహా పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడారు. ఇంటర్వ్యూ సందర్భంగా చివరిసారిగా ఎప్పుడు ఏడ్చారన్న ప్రశ్నకు సుందర్ పిచాయ్ బదులిస్తూ... ‘‘కోవిడ్ వేళ ప్రపంచవ్యాప్తంగా నిలిపి ఉంచిన మోర్గ్ ట్రక్కులను చూసినప్పుడు.. రెండు నెలల క్రితం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకున్నాను’’ అన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్లో భాగంగా ఏప్రిల్-మే నెలల్లో భారత దేశంలో వేలాది మంది మరణించారు. గంగా నదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు దర్శనమిచ్చాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ పరిస్థితులు తనను ఎంతో బాధించాయన్నారు పిచాయ్. అంతేకాక ‘‘నేను అమెరికన్ పౌరుడిని. కానీ నాలో భారతీయత ఎంతో లోతుగా పాతుకుపోయింది. నేను ఎవరు అనే విషయానికి వస్తే.. ఈ భారతీయత నాలో అతి పెద్ద భాగంగా నిలుస్తుంది. నేను దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాను. సాంకేతికతలో చోటు చేసుకుంటున్న మార్పులు నాపై ఎంతో ప్రభావం చూపేవి. నా బాల్యంలో చూసిన రోటరి ఫోన్.. పాత స్కూటర్ ఇవన్ని నన్ను చాలా ఆశ్చర్యపరిచేవి’’ అని సుందర్ పిచాయ్ తెలిపారు. ‘‘నా తండ్రి ఏడాది మొత్తం జీతం ఖర్చు చేస్తే నేను అమెరికా చేరుకోగలిగాను. కాలీఫోర్నియాలో దిగినప్పుడు నేను ఊహించుకున్న దానికి వాస్తవ పరిస్థితులకు చాలా తేడా గమనించాను. అమెరికా చాలా ఖరీదైనది. ఇక్కడ ఓ బ్యాక్పాక్ కొనాలంటే దాని విలువ మా నాన్న నెల జీతంతో సమానంగా ఉంటుంది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కేవలం అదృష్టం మాత్రమే కారణం కాదు. సాంకేతికత మీద నాకున్న అభిమానం కూడా నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది’’ అని తెలిపారు సుందర్ పిచాయ్. పాస్వర్డ్ మార్చను ఎందుకంటే.. బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్ తాను పాస్వర్డ్ను తరచూ మార్చనని వెల్లడించారు. వినియోగదారులు వారి పాస్వర్డ్లను తరచూ మార్చడానికి బదులుగా “రెండు-కారకాల ప్రామాణీకరణ” (టూ ఫాక్టర్ అథెంటికేషన్)ఎంచుకోవాలని ఆయన సిఫార్సు చేశారు. ‘‘పాస్వర్డ్ను పదేపదే మార్చడం కంటే రెండు-కారకాల ప్రామాణీకరణ మార్గం ఎంతో సురక్షితం. ఎందుకంటే పాస్వర్డ్లను చాలా తరచుగా మార్చినప్పుడు, వాటిని గుర్తుంచుకోవడంలో మీకు ఇబ్బంది తలెత్తుతుంది. కనుక రెండు-కారకాల ప్రామాణీకరణను ఎంచుకోవడం ఎంతో మంచిది’’ అన్నారు. అంతేకాక తాను ఒకేసారి 20కి పైగా ఫోన్లను ఉపయోగిస్తానని తెలిపారు. మార్కెట్లోకి వచ్చిన ప్రతి ఫోన్ని పరీక్షిస్తాను అని సుందర్ పిచాయ్ తెలిపారు. . -
దేవుడా.. ఈ హత్యను క్షమించేసెయ్!
తాప్సీ చాలా డేరింగ్ అండ్ డేషింగ్. మనసులో అనుకున్నవాటిని నిర్మొహమాటంగా, నిర్భయంగా బయటకు వ్యక్తపరుస్తుంటారు. అందుకు ఉదాహరణ కావాలంటే ఆమె ట్విట్టర్ చూడొచ్చు. అందులో తాను చేసే సినిమాల గురించి మాత్రమే కాకుండా, పలు సామాజిక అంశాల గురించి కూడా పొందుపరుస్తుంటారు. తాజాగా ఆమె చేసిన ట్వీట్స్లో ఎక్కువ శాతం నిర్భయ ఘటన గురించి ఉన్నాయి.ఈ ఘటనకు సంబంధించిన దోషుల్లో ముఖేష్ సింగ్ ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో... ‘అత్యాచారం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ప్రతిఘటించి ఉండకపోతే బతికి ఉండేదేమో’ అని వ్యాఖ్యానించడం పలువుర్ని ఆగ్రహానికి గురి చేసింది. తాప్సీ అయితే, ‘దేవుడా.. ఈ ఒక్క హత్యను క్షమించేసేయ్.. నాకతన్ని చంపేయాలని ఉంది’ అని ట్విట్టర్లో ఆవేశంగా స్పందించారు. తాను పక్కా స్త్రీవాదిననీ, మహిళల రక్షణార్థం తన వాణిని వినిపించడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటానని తాప్సీ పేర్కొన్నారు. -
తప్పంతా ఆమెదే: ‘నిర్భయ’ దోషి ముఖేశ్
న్యూఢిల్లీ: ‘ఆమెనే తప్పు పట్టాలి. ఆమె ఎదురుతిరిగి ఉండాల్సింది కాదు’. ఢిల్లీలో రెండేళ్ల క్రితం నిర్భయపై కిరాతకానికి పాల్పడి, ఉరిశిక్షకు గురైన నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ తాజాగా బీబీసీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలివి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘భారత కూతురు’ పేరుతో మార్చి 8న ఎన్డీటీవీలో రానున్న డాక్యుమెంటరీలో భాగంగా ఈ ఇంటర్వ్యూ చేశారు. ఉరిశిక్ష అమలుకానున్నా ఎలాంటి పశ్చాత్తాపం లేని ముఖేశ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రేప్ జరగడానికి పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ బాధ్యులన్నాడు. నిర్భయ ఉదంతం యాదృచ్ఛికంగా జరిగిందని, ఆమె ఎదురు తిరగకపోయి ఉంటే అత్యాచారం చేశాక మామూలుగా వదిలేసి పోయేవారన్నాడు. ఇంతకుముందు అత్యాచారం చేసి బెదిరించి వదిలేసేవారని, ఉరిశిక్ష వల్ల ఇక ముందు బాధితురాలిని చంపేస్తారన్నాడు.