ముగ్గురు ఖాన్‌లనూ మించిన కుబేరుడు! | Bollywood's Only Billionaire Began As Toothbrush Seller Now Richer Than SRK Salman Aamir Combined, Know Interesting Facts | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఖాన్‌లనూ మించిన కుబేరుడు!

Apr 6 2025 1:06 PM | Updated on Apr 6 2025 2:54 PM

Bollywoods only billionaire began as toothbrush seller now richer than SRK Salman Aamir combined

ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2025 ఎడిషన్‌ ఇటీవల విడుదలైంది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన బిలియనీర్లు 205 మంది ఉన్నారు. వీరిలో వినోదం, మీడియా ప్రపంచానికి చెందినవారు కొంతమంది ఉండగా ఇందులో బాలీవుడ్ నుంచి ఉన్న ఏకైక బిలియనీర్ రోనీ స్క్రూవాలా (Ronnie Screwvala). ఒకప్పుడు టూత్ బ్రష్‌లు అమ్మిన ఆయన ఇప్పుడు పరిశ్రమలోని అతిపెద్ద సూపర్ స్టార్ల కంటే ధనవంతుడైన పారిశ్రామికవేత్త.

బాలీవుడ్‌ అపర కుబేరుడు
ఫోర్బ్స్ ప్రకారం.. హిందీ చిత్ర పరిశ్రమ నుండి ఒక బిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న ఏకైక వ్యక్తి మూవీ మాగ్నెట్, పారిశ్రామికవేత్త రోనీ స్క్రూవాలా. ఫోర్బ్స్ కొత్త జాబితా ప్రకారం ఈ మీడియా మొఘల్ నికర విలువ 1.5 బిలియన్ డాలర్లు. దీంతో ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌లుగా ఉన్న ఖాన్‌ త్రయం కంటే ధనవంతుడు. ఎలాగంటే షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) (770 మిలియన్ డాలర్లు), సల్మాన్ ఖాన్ (Salman Khan) (390 మిలియన్ డాలర్లు), అమీర్ ఖాన్ (Aamir Khan) (220 మిలియన్ డాలర్లు) మొత్తం నెట్‌వర్త్‌ 1.38 బిలియన్ డాలర్లు కాగా ఆ ముగ్గురి సంపద కంటే రోనీ స్క్రూవాలా సంపద అధికం.  

రోనీ వ్యాపార ప్రస్థానం
1956లో బొంబాయిలో జన్మించిన స్క్రూవాలా 70వ దశకం చివర్లో టూత్ బ్రష్ ల తయారీ ద్వారా తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారు. 80వ దశకం ప్రారంభంలో ఆసియా క్రీడల పుణ్యమా అని కలర్ టీవీ దేశంలోకి ప్రవేశించినప్పుడు అ బూమ్‌ను స్క్రూవాలా అందిపుచ్చుకున్నారు. అలా ఎంటర్‌టైన్ మెంట్ రంగంలోకి ప్రవేశించి 1990లో యూటీవీని స్థాపించారు. అదే తరువాత యూటీవీ మోషన్ పిక్చర్స్‌గా మారింది. తరువాతి రెండు దశాబ్దాలలో ఈ నిర్మాణ సంస్థలు స్వదేశ్, రంగ్ దే బసంతి, ఖోస్లా కా ఘోస్లా, జోధా అక్బర్, ఫ్యాషన్, ఢిల్లీ బెల్లీ, బర్ఫీమ్ వంటి ఐకానిక్ చిత్రాలను అందించాయి. అలాగే శాంతి, హిప్ హిప్ హుర్రే, షకా లకా బూమ్ బూమ్, కిచిడి, షరారత్ వంటి టీవీ షోలను అందించాయి.

తర్వాత రోనీ స్క్రూవాలా 2012లో యూటీవీని డిస్నీకి బిలియన్ డాలర్ల ఒప్పందంలో అమ్మేశారు. అనంతరం ఐదు సంవత్సరాలకు ఆర్ఎస్‌వీపీ మూవీస్‌ సంస్థను స్థాపించారు. అలా ఎంటర్‌టైన్మెంట్ ప్రపంచంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన కేదార్‌నాథ్, ఉరీ, ది స్కై ఈజ్ పింక్, సామ్ బహదూర్ చిత్రాలను నిర్మించారు. 2024లో స్క్రూవాలా షార్క్ ట్యాంక్ ఇండియాలో షార్క్‌లలో ఒకరిగా వెండితెర అరంగేట్రం చేశారు.  రోనీ స్క్రూవాలాకు సినిమాలే ఏకైక ఆదాయ వనరు కాదు. అప్ గ్రాడ్, యూనిలాజర్, యూఎస్ స్పోర్ట్స్ వంటి పలు స్టార్టప్ లలో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా కొన్నింటిని స్థాపించారు. ఈ సంస్థల విజయం, తన సినిమా వ్యాపారం ఆయన భారీ సంపదను పోగుచేసుకోవడానికి దోహదపడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement