బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

Jun 27 2023 4:36 AM | Updated on Jun 27 2023 11:14 AM

- - Sakshi

పెద్దేముల్‌: మండల పరిధిలోని ఇందూరు మీదుగా బస్సు నడపాలని సోమవారం జైరాంతండా విద్యార్థులు రోడ్డెక్కారు. సుమారు గంట పాటు ఓంలానాయక్‌తండా– జైరాంతండా రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాలు రెండువైపులా నిలిచిపోయాయి. గతంలో ఇందూరు, తట్టెపల్లి మీదుగా బస్సు నడిచేదని, ఆ బస్సును అడ్కిచెర్ల, జిన్‌గూర్తి మీదుగా నడపడం వల్ల పాఠశాలకు వెళ్లే, వచ్చే సమయాల్లో బస్సులు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోకపోవడంతో చేసేదిలేక ఆందోళనకు దిగాల్సివచ్చిందని వారు వాపోయారు.

ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ కర్ణాటక సరిహద్దులో ఓంలానాయక్‌తండా, జైరాంతండా ఉండటంతో బస్సులు తప్ప మరో అవకాశం లేదని, వెంటనే సంబంధిత అధికారులు బస్సును వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు తాండూరు డిపో మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. జైరాంతండా బస్సును ఇందూరు మీదుగా నడపాలని కోరారు. వెంటనే స్పందించి డీఎం తప్పకుండా జైరాంతండా బస్సును ఇందూరు మీదుగా నడుపుతామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement