తెలంగాణ: నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థినులను లెక్చరర్ భాస్కర్ గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం బయటకు రావడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది.
దీంతో విద్యార్థినులను వేధిస్తున్నాడని తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు లెక్చరర్ను నిలదీశారు. ఈ క్రమంలో లెక్చరర్పై దాడి చేసి, కాలేజీ ఆవరణలో విద్యార్థులు, తల్లిదండ్రులు చూస్తుండగానే అతనిని చితకబాదారు. లెక్చరర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం కాలేజీ ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. విద్యార్థినుల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాలేజీ యాజమాన్యం, అధికారులు చర్యలు చేపట్టాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.


