సాక్షి టాస్క్ఫోర్స్:టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ముఖ్య నేత అనుచరుడు, ఊరందూరు గ్రామానికి చెందిన తెలుగు తమ్ముడు సాగిస్తున్న ఇసుక దందా బట్టబయలైంది. రేణిగుంట కేంద్రంగా ఆయన రూ.కోట్ల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిసింది. రాజంపేట నుంచి టిప్పర్ల ద్వారా ఇసుకను రేణిగుంటకు చేర్చి కంటైనర్ల ద్వారా తమిళనాడుకు తీసుకెళ్లి విక్రయిస్తున్న విషయం పోలీసుల దాడిలో తేటతెల్లమైంది. వివరాలు.. గురువారం ఈ మేరకు రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి మాట్లాడుతూ మండలంలోని కొట్రమంగళం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు కంటైనర్లు, లోడ్ చేస్తున్న మరో రెండు జేసీబీలు, ఓ ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇసుక దందాపై బుధవారం సాయంత్రం సమాచారం అందడంతో దాడి చేసినట్లు వెల్లడించారు. శివకుమారి అనే రియల్టర్ వెంచర్లో డంప్ చేసిన ఇసుకను కంటైనర్ల ద్వారా తరలించేందుకు సిద్ధమవుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అలాగే ఇసుక వాహనాలకు పైలట్ గా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న కారుని సైతం స్వాధీనం చేసుకున్నామన్నారు. విచారణలో శ్రీకాళహస్తి మండలం ఊరందూరుకు చెందిన బి.బాలాజీ, (34), పూడి గ్రామానికి చెందిన అజిత్ (28), మరో ఇద్దరు దందా నడిపిస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు. నిందితులు టిప్పర్లలో రాజంపేట నుంచి ఇసుకను తీసుకు వచ్చి పెనుబాల కాలేజీ వెనుక వైపు ఉన్న ఒక వెంచర్ లో డంప్ చేసి రాత్రివేళల్లో కంటైనర్ల ద్వారా చైన్నెకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో బాలాజీ, అజిత్తోపాటు డ్రైవర్లు చిత్రై సెల్వన్, రాజన్ యాదవ్, అనిష్ కుమార్ సింగ్పై కేసు నమోదు చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. గాజులమండ్యం ఎస్ఐ హరీష్ పాల్గొన్నారు.


