తిరుపతి అర్బన్ : మనిషి ఆరోగ్యకర జీవనానికి తొలి అడుగు తల్లిపాలే అని, శిశువు సుస్థిర జీవితానికి ఉపయోగకరమని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ శిశువు జన్మించిన వెంటనే అమ్మపాలు పట్టించడం ద్వారా తల్లీబిడ్డల మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుందని చెప్పారు. వైద్యులతోపాటు ఏఎన్ఎంలు, అశావర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో తల్లిపాల ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఐసీడీఎస్ పీడీ వసంతబాయి మాట్లాడుతూ అంగన్వాడీ పరిధిలో బాలింతలకు స్పష్టంగా తల్లిపాల విశిష్టతను వివరిస్తున్నామని వెల్లడించారు. తల్లిపాల ద్వారా శిశువులకు కలిగే ప్రయోజనాలను బాలింతలకు వివరిస్తున్నారని తెలిపారు.
మెరుగైన ‘వసతి’కి ప్రాధాన్యం
సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలన్నారు. హాస్టళ్ల భవనాల పైకప్పులు, గోడలు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, మరుగుదొడ్లు, వంటశాలలు, డ్రైనేజీ, ప్రహరీగోడ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పనుల్లో నాణ్యతాప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమశాఖ అధికారులు హరీష్, భరత్కుమార్రెడ్డి, రాజా సోము, గనుల శాఖ అధికారి బాలాజీ నాయక్ పాల్గొన్నారు.


