అరసవల్లి: ఎట్టకేలకు జిల్లా వైద్యారోగ్య శాఖా ధికారిగా డాక్టర్ ఈవీ నరేష్కుమార్ సోమ వారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. గత నెల 13న జిల్లాకు డీఎంహెచ్ఓగా నియ మిస్తూ ఉత్తర్వులు వచ్చినా.. విశాఖపట్నంలో రిలీవింగ్ సమస్యల కారణంగా సరిగ్గా 40 రోజుల తర్వాత స్థానిక జిల్లాలో డీఎంహెచ్ఓగా నరేష్కుమార్ విధుల్లోకి చేరారు. ఈ సందర్భంగా జిల్లాలో వైద్యారోగ్యశాఖకు చెందిన కీలక అధికారులు, వైద్యులు, ఇతర విభాగాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కోవిడ్ సమయంలో తాను ఇక్కడ నోడల్ అధికారిగా పనిచేశానని, సీతంపేట ఐటీడీఏ పరిధిలోనూ వైద్యాధికారిగా విధులు నిర్వర్తించానని అన్నా రు. ఫైళ్లు నడపడంలో జాప్యం జరిగితే ఎలాంటి మొహమాటం లేకుండా చర్యలకు దిగి ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటానని స్పష్టం చేశారు. తప్పు చేస్తే ఉపేక్షించబోనని తేల్చి చెప్పారు.
పొలం పనికి వెళ్లి కుప్పకూలిన యువకుడు
మందస: మండలంలోని జిల్లుండ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రౌతు తిరుపతిరావు(30) సోమవారం ఉదయం పొలంలో గట్లు వేసేందుకు వెళ్లాడు. ఎండ తీవ్రంగా ఉండడంతో పొలంలోనే నేలకు ఒరిగిపోయాడు. తోటి రైతులు చూసి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి పరీక్షించి తిరుపతిరావు చనిపోయినట్లు నిర్ధారించారు. తిరుపతిరావు జీవన ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లి పని చేసి తన సొంత గ్రామానికి వచ్చి తన సొంత పనులు చేసుకుంటున్నాడు. తిరుపతికి భార్య రాజేశ్వరి, కుమారుడు ఉన్నాడు. కుమారుడు దివ్యాంగుడు. తిరుపతిరావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
హెచ్ఎంపై ఆరోపణలు.. డీఈఓకు నివేదిక
నరసన్నపేట: మేజరు పంచాయతీ పరిధిలోని దేశవానిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిపై అదే స్కూల్లో పనిచేస్తున్న మహిళా టీచర్లు చేసిన ఫిర్యాదుపై విచారణ చేసి నివేదికను డీఈఓ రవిబాబుకు పంపించానని డిప్యూటీ డీఈఓ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం ఉదయానికే డిప్యూటీ డీఈఓ స్కూల్కు ఎంఈఓ యు.శాంతారావుతో కలిసి వెళ్లారు. ముందుగా హెచ్ఎంతో మాట్లాడారు. అనంతరం స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులందరితో సమావేశం నిర్వహించి వివరాలు సేకరించారు. తరువాత ఫిర్యాదు చేసిన మహిళా టీచర్లతో వేర్వేరుగా మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. వారి సెల్ఫోన్లను కూడా పరిశీలించారు. హెచ్ఎం వేధింపుల సెల్ రికార్డును డిప్యూటీ డీఈఓకు ఒక ఉపాధ్యాయుడు అందజేసినట్లు సమాచారం.
శ్రీకాకుళం కల్చరల్: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈ నెల 26న శ్రీకాకుళం నగరంలో నిర్వహించనున్న ర్యాలీని విజయవంతం చేయాలని నగర ముస్లిం జమాత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు స్థానిక జామియా మసీదు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు జమాత్ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని అన్ని మసీదుల ఇమాములు, అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ సభ్యులు, పట్టణంలోని ముస్లింలందరూ ర్యాలీలో బాధ్యతగా పాల్గొని ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనాలకు ర్యాలీలో అనుమతి ఉండదని, వృద్ధులు, పిల్లల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


