తీర గ్రామాలకు
● వంశధార తీరంలో కోత భయం
● 50 మీటర్ల వరకు గట్టు కోత
● గ్రోయిన్లు నిర్మించాలని వినతి
ప్రమాదం అంచున ఉన్నాం
నదికి దగ్గరగా రెండు మీటర్లు దూరంలో ఉన్నాం. చిన్నపాటి వరద వస్తే చాలు ఇళ్లలోకి నీరు వచ్చేస్తోంది. ఒకటి రెండు సార్లు మేకలు, పాడి ఆవులు కూడా వరదకు కొట్టుకు పోయిన సందర్బాలు ఉన్నాయి.
– రేగాన శ్యామ్ సుందర్, రామకృష్ణాపురం
గ్రోయిన్లు కట్టాలి
అర్జెంటుగా గ్రోయిన్స్ నిర్మాణాలు చేపట్టాలి. ఇంకా రెండు మూడు వరదలు వస్తే ప్రమాదం తప్పదు. మాకే కాదు నది తీర గ్రామాలు ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి. – అందవరపు రాము, అంధవరం
జలుమూరు:
వంశధార నదీ తీర గ్రామాలు మళ్లీ భయం గుప్పెట్లోకి వెళ్లిపోతున్నాయి. వానాకాలం నాలుగు నెలల పాటు వీరికి ఈ ఆందోళన తప్పడం లేదు. ఆగస్టు మొదలు అక్టోబర్ వరకు వీరిని వరద భయం వెంటాడుతుంది. ప్రధానంగా ఈ గ్రామాలకు ఆనుకొని కరకట్ట నిర్మాణం జరగక పోవడం, ఆపైన నదిలో ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వుకుపోవడంతో పాటు ప్రవాహం ఉన్న చోట గ్రోయిన్లు నిర్మించకపోవడంతో ఏటా వరద ముంచెత్తుతోంది. దీంతో ఇళ్ల వరకు కోత జరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.
నదితీర గ్రామాలు 30
వంశధార నదీ తీర గ్రామాలు ఇటు నరసన్నపేట, అటు జలుమూరు, పోలాకి మండలాల్లో 30 వరకూ ఉంటాయి. ఇందులో అత్యంత ప్రమాదకరంగా ఉన్నవి గెడ్డవానిపేట, వెంకటాపురం, కొబగాం, అందవరం, ఉప్పరపేట, రామకృష్ణాపురం, పర్లాం, గొల్లపేట, డోలపేట, బుచ్చిపేట, డోల, గోవిందపురం, రేవు అంప్లాం, వనిత మండలం తదితరవి 20 వరకూ ఉంటాయి. నదిలో ప్రవాహం ఎక్కువైతే చాలు గ్రామాల గట్టు కోరుకుపోయి గ్రామంలోకి నీరు చొరబడుతోంది.
కరకట్ట కట్టలేదు
వరద నివారణతోపాటు పంటపొలాలు రక్షించేందుకు వంశధార నదికి ఆనుకొని ఉన్న గ్రామాల పక్కన కరకట్ట కడుతామన్న ప్రతిపాదనలు ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు. 2011లో కరకట్ట నిర్మాణాలకు సుమారు రూ.52 కోట్లు నిధులు మంజూరయ్యాయి. 15 శాతం నిర్మాణాలు కూడా జరిగాయి. తర్వాత ఆగిపోయాయి. అధికారులు స్పందించి కరకట్ట నిర్మాణంతోపాటు ముంపు వద్ద గ్రోయిన్స్ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.


