
మాక్స్వెల్- మిచెల్ (PC: PBKS X)
ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell) స్థానాన్ని మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ ఓవెన్ (Mitchell Owen)తో పంజాబ్ యాజమాన్యం భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
గాయం కారణంగా దూరం
కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంజాబ్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ను రూ. 4.20 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్పిన్నర్గా ఫర్వాలేదనిపించినా బ్యాటర్గా మాత్రం మాక్సీ తేలిపోయాడు. ఈ సీజన్లో ఏడు మ్యాచ్లాడిన అతను 48 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో 4 వికెట్లు తీశాడు.
అయితే, వేలికి గాయం కావడంతో ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు మ్యాక్స్వెల్ అందుబాటులో ఉండడని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బుధవారం (ఏప్రిల్ 30) స్పష్టం చేశాడు.
రూ. 3 కోట్లకు
చెన్నైతో మ్యాచ్కు ముందు పంజాబ్ సారథి శ్రేయస్ మాట్లాడుతూ... ‘అనుకోకుండా మ్యాక్స్వెల్ గాయపడ్డాడు. అతడి వేలు విరిగింది. మ్యాక్స్వెల్ స్థానంలో ఎవరిని తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదు’ అని అన్నాడు. అయితే, తాజాగా మాక్సీ స్థానాన్ని మిచెల్ ఓవెన్తో భర్తీ చేశారు. రూ. 3 కోట్లకు పంజాబ్ అతడిని జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా టాస్మేనియాకు చెందిన మిచెల్ ఓవెన్ 34 ఇప్పటికి టీ20 మ్యాచ్లు ఆడి 646 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 108. ఈ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఖాతాలో పది టీ20 వికెట్లు కూడా ఉన్నాయి.
బీబీఎల్ సంచలనం
ఇక ప్రస్తుతం ఓవెన్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, అతడు త్వరలోనే పంజాబ్ కింగ్స్తో చేరతాడు. 2024-25 బిగ్బాష్ లీగ్లో 452 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. 200కు పైగా స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేసి హోబర్ట్ హ్యారికేన్స్ తొలిసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
కాగా సౌతాఫ్రికా స్టార్ కార్బిన్ బాష్ స్థానంలో మిచెల్ ఓవెన్ పెషావర్ జల్మీలో చేరాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఆడేందుకు బాష్ కాంట్రాక్టు రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతడిపై రెండేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.
అయితే, ఓవెన్ మాత్రం ప్లే ఆఫ్స్ సమయానికి పంజాబ్ కింగ్స్తో చేరతాడని.. అంతవరకు పీఎస్ఎల్లో కొనసాగుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా పీఎస్ఎల్ మే 18తో ముగుస్తుండగా.. మే 20 నుంచి ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్లు మొదలుకానున్నాయి.
వారి పేర్లు వినిపించాయి
ఇదిలా ఉంటే.. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికి పది మ్యాచ్లు పూర్తి చేసుకుని ఆరు గెలిచి.. పన్నెండు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
ఆదివారం నాటి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ విధ్వంసకరవీరుడికి యాజమాన్యం పిలుపునివ్వడం విశేషం.
కాగా ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారయ్యే ముందు మ్యాక్స్వెల్ జట్టుకు దూరమవడంతో పంజాబ్ కింగ్స్ జట్టు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. వెస్టిండీస్ ఆల్రౌండర్ రోస్టన్ ఛేజ్, దక్షిణాఫ్రికా యువ ఆటగాడు లెస్ డు ప్లోయ్, అఫ్గానిస్తాన్ ఆల్రౌండర్ సలామ్ ఖైల్లో ఒకరిని ఎంపిక చేసుకోవచ్చనే అంచనాలు నెలకొనగా.. అనూహ్యంగా మిచెల్ ఓవెన్ జట్టులోకి వచ్చాడు.
చదవండి: RCB VS CSK: ఓటమికి నాదే బాధ్యత.. అతను గొప్పగా ఆడాడు: ధోని