జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్కు బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. జింబాబ్వేతో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్లో రాణించిన ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత కల్పించారు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ జట్టును కాకుండా రెండో జట్టును అక్కడికి పంపుతున్న నేపథ్యంలో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ సిరీస్కు సంబంధించి టీమిండియా ఎంపికలో ప్రస్తుత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. జింబాబ్వే సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లలో శ్రేయస్ సహా నలుగురు ఆటగాళ్లు పంజాబ్ కింగ్స్ జట్టుకు చెందినవారే కావడం విశేషం. కెప్టెన్ శ్రేయస్తో పాటు సూర్యాన్ష్ షెడ్గే, ప్రబ్సిమ్రన్ సింగ్, యష్ ఠాకూర్లు ఎంపికయ్యారు. వీరంతా ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించారు.
మిగిలిన ఆటగాళ్ల విషయానికొస్తే ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు (అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హర్ష్ దూబే), కేకేఆర్ నుంచి వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్ ఉన్నారు. ఇక లక్నో సూపర్జెయింట్స్ నుంచి మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్లు ఉండగా, సీఎస్కే నుంచి శివమ్ దూబే, రాజస్తాన్ రాయల్స్ నుంచి వైభవ్ సూర్యవంశీ, ముంబై ఇండియన్స్ నుంచి తిలక్ వర్మ, గుజరాత్ టైటాన్స్ నుంచి అశోక్ శర్మకు చోటు దక్కింది.
అయితే మిగిలిన రెండు ఫ్రాంచైజీలు ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మాత్రం ఒక్క ఆటగాడు కూడా ఎంపిక కాలేదు. 'ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టు ఎంపికలో శ్రేయస్ అయ్యర్ హవా నడుస్తుందని.. చాంపియన్గా నిలిచిన ఆర్సీబీ నుంచి మాత్రం ఒక్క క్రికెటర్కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది' అని పేర్కొన్నారు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జూలై 23న హరారే వేదికగా జింబాబ్వే, భారత్ తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నాయి.
జింబాబ్వే పర్యటనకు భారత జట్టు
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రబ్సిమ్రన్ (వికెట్ కీపర్)


