‘ఫొటోలు, వీడియోలు తీశాడు.. బతిమిలాడాడు’ | I Suspect He Came With Intention Of: Shashank Singh Denies Allegations | Sakshi
Sakshi News home page

‘ఫొటోలు, వీడియోలు తీశాడు.. దొంగతనానికి వచ్చాడనుకున్నాం’

Jul 1 2026 1:25 PM | Updated on Jul 1 2026 2:35 PM

I Suspect He Came With Intention Of: Shashank Singh Denies Allegations

తనపై వస్తున్న ఆరోపణలపై పంజాబ్‌ కింగ్స్‌ క్రికెటర్‌ శశాంక్‌ సింగ్‌ స్పందించాడు. వంటమనిషిగా చెప్పుకొంటున్న వ్యక్తి చెప్పినట్లుగా అతడిపై తాము దాడిచేయలేదని స్పష్టం చేశాడు. నిజానికి వంట పేరుతో ఇంట్లో చేరి అతడే తమను ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించాడు.

దాడికి పాల్పడ్డారు!
కాగా శశాంక్‌ సింగ్‌, అతడి తండ్రి, విశ్రాంత స్పెషల్‌ డీజీపీ శైలేశ్‌ సింగ్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. వారి ఇంట్లో వంట మనిషిగా చేరిన వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా భోపాల్‌లో ఎఫ్‌ఐర్‌ నమోదైంది. తనను పదే పదే దూషిస్తూ ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా.. బంధించి కొట్టారని అతడు ఆరోపించాడు. పని మానేయాలని అనుకున్నానని.. అంతలోనే ఇలా తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు చేశాడు.

ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండేవాడు
ఈ విషయం గురించి శశాంక్‌ సింగ్‌ తాజాగా ANIతో మాట్లాడాడు. ‘‘మేము అతడిని బంధించలేదు. నిజానికి అతడు వంట చేస్తానంటూ మా ఇంట్లో అడుగుపెట్టాడు. కానీ అతడికి వంట చేయడం రానేరాదు.

మా ఇల్లంతా తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండేవాడు. నా గదిలోకి కూడా వచ్చి అక్కడ రికార్డింగ్‌ చేశాడు. అతడి వ్యవహారశైలిపై మాకు అనుమానం వచ్చింది. ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాడని అనిపించింది. అయితే, మా ఇంట్లో వస్తువులు ఎక్కడివి అక్కడే ఉండటంతో ఊపిరి పీల్చుకున్నాం.

డిలీట్‌ చేయమని హెచ్చరించింది
ఇప్పటి వరకు ఈ విషయం గురించి పోలీసులు మమ్మల్ని సంప్రదించలేదు. అతడు మా ఇంట్లో ఫొటోలు, వీడియోలు తీయడం చూసి మా అమ్మ వాటిని డిలీట్‌ చేయమని అతడిని హెచ్చరించింది. నా సోదరి 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తానని అతడితో అన్నది. అయితే, అతడు మాత్రం ఇంకెప్పుడూ ఇలా చేయనంటూ బతిమిలాడుకున్నాడు.

కానీ తిరిగి మా మీదే ఆరోపణలు చేశాడు. నేను ఎవరినీ అసభ్యంగా కూడా దూషించను. అలాంటిది ఏకంగా దాడి చేశానని అంటే నా గురించి తెలిసిన వారు ఎవరూ నమ్మరు. అతడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు’’ అని శశాంక్‌ సింగ్‌ కొట్టిపారేశాడు.

అదే నిజమైతే కఠిన చర్యలు
అయితే, వంట మనిషి ఫిర్యాదు ఆధారంగా తాము ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు జోన్‌ 1 అదనపు డీసీపీ రష్మీ అగర్వాల్‌ దూబే జాతీయ మీడియాకు వెల్లడించారు. ‘‘శైలేశ్‌ సింగ్‌, అతడి కుమారుడు, క్రికెటర్‌ శశాంక్‌ సింగ్‌, వారి డ్రైవర్‌పై కేసు నమోదు చేశాము.

ఫిర్యాదుదారును వైద్య పరీక్షల నిమిత్తం పంపించాము. ఒకవేళ అతడికి గాయాలయ్యాయని తేలితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. అయితే, అతడిని చూసినపుడు.. అతడు ఆరోపించినట్లు తీవ్రమైన గాయాలు అయినట్లు మాకు కనిపించలేదు. అందుకే పరీక్షలకు పంపించాము’’ అని ఆమె పేర్కొన్నారు.

చదవండి: హార్దిక్‌  పాండ్యా సంచలన నిర్ణయం! 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement