కేఎల్ రాహుల్ (PC: BCCI X)
శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఫామ్లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. టీ విరామం అనంతరం తిరిగి బ్యాటింగ్కు వచ్చిన అతడు.. కండరాలు పట్టేయడంతో వెంటనే మైదానాన్ని వీడాడు.
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా రెండు మ్యాచ్లు ఆడేందుకు శ్రీలంకకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె వేదికగా శనివారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
77 పరుగులు
ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (32) రనౌట్ కాగా.. కేఎల్ రాహుల్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టీ విరామానికి ముందు ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మొత్తంగా 162 బంతులు ఎదుర్కొని.. తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 77 పరుగులు సాధించాడు.
చేయి నొప్పి
ఈ క్రమంలో రాహుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ్ల.. టీ బ్రేక్ నుంచి రాగానే ఒక్కసారిగా అసౌకర్యానికి గురయ్యాడు. బ్యాటింగ్కు వెళ్లే ముందే తన కుడిచేయి నొప్పిగా ఉందని అంపైర్కు ఫిర్యాదు చేశాడు. డ్రెసింగ్రూమ్ నుంచి ఫిజియో వచ్చేలోగా.. మరో ఎండ్లో ఉన్న దేవదత్ పడిక్కల్ వచ్చి.. రాహుల్ చేయిని స్ట్రెచ్ చేశాడు. దీంతో అతడికి నొప్పి మరింత ఎక్కువైంది.
కుంటుకుంటూ
ఇంతలో ఎడమ చేయి కూడా నొప్పి పుట్టడంతో రాహుల్ విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి పరిశీలించగా.. రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. వెళ్తున్నపుడు కూడా రాహుల్ కుంటుతూ నడవడం ఆందోళనకరంగా పరిణమించింది.
ఫిజియో సాయం లేకుండా అతడు అసలు నిల్చోలేకపోయాడు. ఇక రాహుల్ స్థానంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ క్రీజులోకి రాగా.. వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ శతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్లో అతడికి ఇదే తొలి సెంచరీ.
గాయాల బెడద
ఇదిలా ఉంటే.. ఇప్పటికే టీమిండియా గాయాల బెడదతో సతమతమవుతోంది. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ గాయాల బారిన పడి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్నారు. తాజాగా రాహుల్ కూడా గాయపడటం టీమిండియా శిబిరంలో కలకలం రేపుతోంది.


