టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. తన కెరీర్లో మొదటి 30 టెస్టులను వేర్వేరు మైదానాలలో ఆడిన మూడో భారత క్రికెటర్గా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. గాలే వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టులో యశస్వి ఈ ఫీట్ అందుకున్నాడు.
ఈ రేర్ ఫీట్ జైశ్వాల్ కంటే ముందు సచిన్ టెండూల్కర్(32), సంజయ్ మంజ్రేకర్లు(30) సాధించారు. తాజా మ్యాచ్తో వీరి సరసన యశస్వి చేరాడు. 2023లో డొమినికా వేదికగా వెస్టిండీస్పై అరంగేట్రం చేసిన జైశ్వాల్.. ఇప్పటివరకు ఆడిన ఏ 30 టెస్టుల్లోనూ ఒక్క వేదికను కూడా రెండోసారి పునరావృతం చేయకపోవడం గమనార్హం.
ఇక ఈ మ్యాచ్లో జైశ్వాల్ను దురదృష్టం వెంటాడింది. మొదటి ఇన్నింగ్స్లో 32 పరుగులు చేసి మంచి టచ్లో కనిపించిన జైశ్వాల్.. ఊహించని విధంగా రనౌటయ్యాడు. 11వ ఓవర్లో కేఎల్ రాహుల్ మిడ్-ఆన్ వైపు డ్రైవ్ షాట్ ఆడగా.. శ్రీలంక బౌలర్ కేశర నువంత బంతిని ఆపే క్రమంలో నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న జైశ్వాల్ను ఢీకొట్టాడు.
దీంతో జైస్వాల్ కింద పడిపోయాడు. అంతలోనే రాహుల్ బౌలర్ ఎండ్వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. జైశ్వాల్ పడిపోవడం చేసి రాహుల్ క్రీజు మధ్యలోనే అగిపోయాడు. వెంటనే లేచిన జైస్వాల్ మాత్రం స్ట్రైకర్ ఎండ్ వైపు పరిగెత్తే ప్రయత్నం చేయడంతో రాహుల్ బౌలర్ ఎండ్వైపు రన్ చేశాడు.
కానీ జైస్వాల్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని నాన్ స్ట్రైకర్వైపు పరిగెత్తాడు. దీంతో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్కు చేరుకోవడంతో జైశ్వాల్ రనౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది.


