
నిన్న (మే 3) ఆర్సీబీ చేతిలో (బెంగళూరులో) ఎదురైన ఓటమికి సీఎస్కే స్టాండ్ ఇన్ కెప్టెన్ ఎంఎస్ ధోని బాధ్యత తీసుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పాడు. ఈ మ్యాచ్లో సీఎస్కే 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి బంతి వరకు పోరాడింది.
ధోని క్రీజ్లోకి వచ్చే సమయానికి సీఎస్కే గెలుపుకు 21 బంతుల్లో 42 పరుగులు కావాలి. 17వ ఓవర్లో జడేజా ఓ సిక్సర్ బాదడంతో సమీకరణలు 18 బంతుల్లో 35 పరుగులకు మారాయి. అప్పటికి వరకు మ్యాచ్ సీఎస్కే చేతుల్లోనే ఉండింది.
అప్పటికే మ్యాచ్లో 22 సిక్సర్లు నమోదై ఉండటం, మంచు కూడా బ్యాటర్లకు అనుకూలంగా ప్రభావం చూపిస్తుండటంతో సీఎస్కే సునాయాసంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే అప్పటికే క్రీజ్లో సెట్ అయిన జడేజా, అప్పుడే వచ్చిన ధోని 18వ ఓవర్ వేసిన సుయాశ్ శర్మను డీల్ చేయలేకపోయారు.
వీరిద్దరు ఈ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే సాధించారు. దీంతో చివరి రెండు ఓవర్లలో సీఎస్కే గెలుపుకు 29 పరుగులు అవసరమయ్యాయి. భువీ వేసిన 19వ ఓవర్ను జడేజా బౌండరీతో మొదలుపెట్టాడు. ఆతర్వాత ఐదో బంతికి ధోని సిక్సర్ కొట్టాడు. ఈ ఓవర్లో సీఎస్కే 14 పరుగులు రాబట్టి గెలుపు దిశగా పయనించింది.
చివరి ఓవర్లో ఆ జట్టు గెలుపుకు 15 పరుగులు అవసరమయ్యాయి. క్రీజ్లో ధోని, జడేజా ఉండటంతో సీఎస్కే గెలుపు ఖాయమే అని అంతా అనుకున్నారు. అయితే ఈ ఓవర్లో దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి ధోని వికెట్ తీయడమే కాకుండా సీఎస్కేను 12 పరుగులకే పరిమితం చేశాడు.
ఫలితంగా సీఎస్కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. మూడో బంతికి ధోని ఔటయ్యాక కూడా సీఎస్కే మ్యాచ్లో ఉండింది. నాలుగో బంతికి దూబే సిక్సర్ బాదాడు. ఆ బంతి నో బాల్ కూడా అయ్యింది. దీంతో చివరి మూడు బంతుల్లో కేవలం ఆరు పరుగులే అవసరమయ్యాయి.
ఈ దశలో దయాల్ అత్యద్భుంగా బౌలింగ్ చేసి మూడు బంతులకు మూడు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో సీఎస్కే 2 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ ఓటమికి తనే బాధ్యత తీసుకుంటున్నానని చెప్పాడు. తాను క్రీజ్లోకి వచ్చిన సమయానికి సీఎస్కేకు విజయావకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఆ సమయంలో తాను మరిన్ని షాట్లు ఆడాల్సిందని తెలిపాడు. తద్వారా సీఎస్కేపై ఒత్తిడి తగ్గేదని అన్నాడు.
వాస్తవానికి ఈ మ్యాచ్ను సీఎస్కే రెండు ఇన్నింగ్స్లలో చివరి ఓవర్లలో కోల్పోయింది. బౌలింగ్ చేస్తూ తొలుత భారీగా పరుగులు సమర్పించుకున్నా.. పతిరణ (4-0-36-3), నూర్ అహ్మద్ (4-0-26-1) మధ్య ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే సీఎస్కేకు భారీ డ్యామేజీ చివరి రెండు ఓవర్లలో జరిగింది. రొమారియో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆ రెండు ఓవర్లలో ఏకంగా 54 పరుగులు రాబట్టాడు.
భారీ లక్ష్య ఛేదనలోనూ సీఎస్కే చివరి నాలుగు ఓవర్ల వరకు విజయం దిశగా సాగింది. ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ల సాయంతో అప్పటి వరకు కంఫర్ట్ జోన్లోనే ఉండింది.
అయితే ఇక్కడే ఆర్సీబీ బౌలర్లు కమ్ బ్యాక్ ఇచ్చారు. 17వ ఓవర్లో ఎంగిడి వరుస బంతుల్లో ఆయుశ్ మాత్రే, బ్రెవిస్ను ఔట్ చేశాడు. ఆతర్వాత వచ్చిన ధోని శాయక్తులా ప్రయత్నించినా సీఎస్కే గెలవలేకపోయింది.
ఆర్సీబీ గెలుపుకు రొమారియోకు క్రెడిట్ ఇచ్చాడు ధోని. తమ బౌలర్లు ఎలా బౌలింగ్ చేసినా రొమారియో నిర్దాక్షిణ్యంగా బాదాడని అన్నాడు. చివరి ఓవర్లలో యార్కర్లు వేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. యార్కర్లు కాకపోతే లో ఫుల్ టాస్ బంతులైనా వేసుండాల్సిందని అన్నాడు. యార్కర్లు, లో ఫుల్ టాస్ బంతులు వేయడంలో తాము ఇంకాస్త మెరుగవ్వాలని తెలిపాడు.