Photo Credit: IPL Twitter
పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ శశాంక్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2026-27 దేశవాళీ సీజన్ ప్రారంభానికి ముందు శశాంక్ సింగ్ ఛత్తీస్గడ్ నుంచి పాండిచ్చేరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. గాయాలతో ఇబ్బంది పడుతున్న తనకు కష్టకాలంలో మద్దతుగా నిలవాల్సిన ఛత్తీస్గఢ్ స్టేట్ క్రికెట్ సంఘ్ (సీఎస్సీఎస్) తనను పక్కనబెట్టిందని, కనీసం వివరణ ఇచ్చుకునే సమయం కూడా తనకు ఇవ్వలేదని శశాంక్ సింగ్ వాపోయాడు. ఇప్పటికే పాండిచ్చేరికి ఆడేందుకు తాను ఛత్తీస్గఢ్ క్రికెట్ బోర్డు నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) కూడా తీసుకున్నట్లు 34 ఏళ్ల శశాంక్ పేర్కొన్నాడు.
ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశాంక్ సింగ్ మాట్లాడుతూ.. 'అవును నేను ఛత్తీస్గఢ్ను వీడుతున్నా. ఇప్పటికే సీఎస్సీఎస్ నుంచి ఎన్వోసీ కూడా తీసుకున్నా. ఈ సీజన్ నుంచి పాండిచ్చేరికి ఆడబోతున్నా. గత సీజన్లో భుజం, చేతి వేలి గాయాలతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నా. కానీ ఛత్తీస్గఢ్ స్టేట్ క్రికెట్ సంఘ్ మాత్రం నాకు ఏ దశలోనూ మద్దతుగా నిలబడలేదు. గాయాల నుంచి కోలుకున్నప్పటికీ, ఛత్తీస్గఢ్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల జాబితా నుంచి నన్ను అకారణంగా తప్పించారు.
అలాగే ప్రీ-సీజన్ శిక్షణా శిబిరం కోసం బెంగళూరు వెళ్లిన జట్టు నుంచి కూడా నన్ను తొలగించారు. ఎందుకు నా పేరు తొలగించారని అడిగితే బోర్డు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అయితే నేను కేవలం ఐపీఎల్ ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వచ్చిన వార్తలు కూడా అవాస్తవం.
అలా అనుకుంటే ఇప్పటిదాకా ఛత్తీస్గఢ్కు ఎందుకు ఆడుతాను? 2023-24 సీజన్లో బెస్ట్ ఆల్రౌండర్ అవార్డు (లాలా అమర్నాథ్ అవార్డు) లభించినప్పడు, బీసీసీఐ నన్ను ఉత్తమ వైట్బాల్ ఆల్రౌండర్గా ప్రకటించినప్పుడు ఛత్తీస్గఢ్ ఈ క్రెడిట్ను తమ ఖాతాలోకి చేర్చుకున్న విషయం మరిచిపోయిందా?’ అని శశాంక్ ప్రశ్నించాడు.
ఇక దేశవాళీలో ముఖ్యంగా వైట్బాల్ క్రికెట్లో శశాంక్ సింగ్కు మంచి రికార్డు ఉంది. 2024-25 విజయ్ హజారే ట్రోఫీలో 450 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీశాడు. ఆ సీజన్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ఏడు మ్యాచ్ల్లో 188 రన్స్ సాధించాడు. అదే ఫామ్ను ఐపీఎల్ 2025 సీజన్లోనూ కంటిన్యూ చేశాడు.
ఆ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరడంలో శశాంక్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. 350 పరుగులు చేసిన శశాంక్ సింగ్ ఆర్సీబీతో జరిగిన ఫైనల్లో 30 బంతుల్లోనే 61 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే దేశవాళీ క్రికెట్లో మెరుగైన అవకాశాల కోసం 2018లో ముంబై నుంచి తన సొంత రాష్ట్రం ఛత్తీస్గఢ్కు మారాడు. తాజాగా వివాదాస్పద రీతిలో ఛత్తీస్గఢ్ను వీడిన శశాంక్ సింగ్ పాండిచ్చేరి జట్టులో చేరడం ద్వారా కెరీర్లో కొత్త ప్రారంభాన్ని ఆశిస్తున్నట్లు శశాంక్ సింగ్ తెలిపాడు.


