సెహ్వాగ్‌ ఇద్దరు కొడుకులు.. కోహ్లి కుటుంబం నుంచి ఒకరు.. | Legendary Opener Sons Kohli Nephew Selected for DPL 2025 Auction: Report | Sakshi
Sakshi News home page

DPL 2025: సెహ్వాగ్‌ ఇద్దరు కొడుకులు.. కోహ్లి కుటుంబం నుంచి ఒకరు..

Jun 30 2025 4:59 PM | Updated on Jun 30 2025 5:30 PM

Legendary Opener Sons Kohli Nephew Selected for DPL 2025 Auction: Report

సెహ్వాగ్‌- కోహ్లి (PC: BCCI)

దేశవ్యాప్తంగా టీ20 లీగ్‌లకు క్రమక్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ (DPL) కూడా తెరమీదకు వచ్చింది. గతేడాది ఆరంభమైన ఈ లీగ్‌ ద్వారా.. ఐపీఎల్‌-2025 నయా సంచలనాలు ప్రియాన్ష్‌ ఆర్య (Priyansh Arya), దిగ్వేశ్‌ సింగ్‌ రాఠి (Digvesh Singh Rathee) వెలుగులోకి వచ్చారు.

డీపీఎల్‌ ప్రస్తుతం రెండో సీజన్‌కు సిద్ధమైంది. ఈసారి అవుటర్‌ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు కూడా లీగ్‌లో ప్రవేశించాయి. ఈసారి మరో అదనపు ఆకర్షణ కూడా ఉంది. టీమిండియా సూపర్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లి కుటుంబం నుంచి ఓ స్పిన్‌ బౌలర్‌ డీపీఎల్‌ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు.

ఆర్యవీర్‌ కోహ్లి ఎంట్రీ?
కోహ్లికి కొడుకు వరసయ్యే ఆర్యవీర్‌ కోహ్లి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.  కోహ్లి చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ దగ్గర అతడు మెళకువలు నేర్చుకుంటున్నాడు అంతేకాదు.. భారత విధ్వంసకర ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ ఇద్దరు కుమారులు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌, వేదాంత్‌ సెహ్వాగ్‌ కూడా డీపీఎల్‌ వేలంలోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి పేర్లు షార్ట్‌లిస్ట్‌ అయినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

సెహ్వాగ్‌ పెద్ద కుమారుడు ఆర్యవీర్‌ ఇప్పటికే ఢిల్లీ అండర్‌ 19 జట్టుకు ఆడుతుండగా.. 15 ఏళ్ల వేదాంత్‌ ఆఫ్‌ స్పిన్నర్‌. ఇతడు అండర్‌-16 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఇద్దరూ డీపీఎల్‌ వేలంలో ‘బి’ కేటగిరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే దిగ్గజాల వారసుల ఆట చూసేందుకు అభిమానులు డీపీఎల్‌పై ఓ లుక్కేయడం ఖాయం.

సత్తా చాటిన ప్రియాన్ష్‌, దిగ్వేశ్‌
కాగా జూలై 5న ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ వేలం జరుగనుంది. ఇక గతేడాది సౌత్‌ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌కు ఆడిన ప్రియాన్ష్‌ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు.. పది మ్యాచ్‌లలో కలిపి 608 పరుగులు చేసి లీగ్‌ టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఈ క్రమంలో రూ. 3.80 కోట్ల ధరతో ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌లో చేరిన ప్రియాన్ష్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మీద 42 బంతుల్లో 103 పరుగులతో చెలరేగి చరిత్ర సృష్టించాడు. మరోవైపు.. సౌత్‌ ఢిల్లీకే ఆడిన దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీ సైతం డీపీఎల్‌లో సత్తాచాటి ఐపీఎల్‌లో ప్రవేశించాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ అతడిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేయగా.. ఈ ఏడాది జట్టు తరఫున టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. 13 ఇన్నింగ్స్‌లో కలిపి పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఇక డీపీఎల్‌లో ఈసారి అవుటర్‌ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు కూడా లీగ్‌లో ప్రవేశించాయి. గతేడాది సౌత్‌ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌, ఈస్ట్‌ ఢిల్లీ రైడర్స్‌, సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌, నార్త్‌ ఢిల్లీ స్ట్రైకర్స్‌, వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌, పురాణీ ఢిల్లీ 6 పేరిట ఆరుజట్లు తలపడ్డాయి. ఈస్ట్‌ ఢిల్లీ రైడర్స్‌ టైటిల్‌ గెలవగా.. సౌత్‌ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌ రన్నరప్‌గా నిలిచింది. ఇక తొలి సీజన్‌కు వీరేందర్‌ సెహ్వాగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే.

చదవండి: ‘షర్మిలా ఠాగూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ను పిలవండి.. ఎవరూ వేలెత్తి చూపరు’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement