‘షర్మిలా ఠాగూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ను పిలవండి.. ఎవరూ వేలెత్తి చూపరు’ | ECB Asked To Invite Saif Ali Khan Sharmila Tagore To Present Pataudi Medal | Sakshi
Sakshi News home page

‘షర్మిలా ఠాగూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ను పిలవండి.. ఎవరూ వేలెత్తి చూపరు’

Jun 30 2025 1:36 PM | Updated on Jun 30 2025 3:11 PM

ECB Asked To Invite Saif Ali Khan Sharmila Tagore To Present Pataudi Medal

ఇంగ్లండ్‌- భారత్‌ మధ్య టెస్టు సిరీస్‌కు కొత్త పేరు పెట్టడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్‌ ఫారూఖ్‌ ఇంజనీర్‌ (Farookh Engineer) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ చర్య వల్ల ఇంగ్లండ్‌- వేల్స్‌ క్రికెట్‌ బోర్డు తన విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించాడు. భారత క్రికెట్‌ రంగానికి సేవ చేయడంతో పాటు ఇంగ్లండ్‌కూ ఆడిన మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ (Mansur Ali Khan Pataudi) పేరు తొలగించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదన్నాడు.

గొప్ప కుటుంబం
కాగా ఇంగ్లండ్‌- టీమిండియా మధ్య టెస్టు సిరీస్‌ను గతంలో పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. అయితే, తాజాగా ఈ సిరీస్‌కు టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీగా నామకరణం చేసింది ఈసీబీ. ఈ క్రమంలో విమర్శలతో పాటు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) నుంచి విజ్ఞప్తి రాగా.. విజేత జట్టు కెప్టెన్‌కు పటౌడీ మెడల్‌ను అందజేస్తామని ప్రకటించింది. తద్వారా పటౌడీ పేరు చిరస్మరణీయం కానుంది.

అయితే, ఈసీబీ నిర్ణయం తనకు అంతగా సంతృప్తినివ్వలేదని షారూఖ్‌ ఇంజనీర్‌ అన్నాడు. ‘‘టైగర్‌ పటౌడీ నాకు స్నేహితుడు. ఇద్దరం కలిసి చాన్నాళ్లు క్రికెట్‌ ఆడాము. అతడిది గొప్ప వారసత్వం. వారిది గొప్ప కుటుంబం. 2007లో పటౌడీ ట్రోఫీని ప్రవేశపెట్టినపుడు ఎంతో సంతోషించా.

షర్మిలా ఠాగూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ను పిలవండి
అయితే, ఇప్పుడు ఆ పేరును తీసేయడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆండర్సర్‌- టెండుల్కర్‌ కూడా దిగ్గజ ఆటగాళ్లే. వారికి ఎవరూ సాటిరారు. ట్రోఫీకి వారి పేరు పెట్టడంలో ఎలాంటి తప్పూ లేదు. అయితే, ఇలాంటి చర్య వల్ల ఈసీబీ తన విశ్వసనీయతను కోల్పోయింది.

మెడల్‌ ఇస్తామంటూ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మెడల్‌ అందిస్తామని చెప్పింది. కేవలం ఇలా చేస్తే సరిపోదు. మన్సూర్‌ భార్య షర్మిలా ఠాగూర్‌, కుమారుడు సైఫ్‌ అలీ ఖాన్‌ల చేతుల మీదుగా ఆ పతకం విజేత జట్టు కెప్టెన్‌కు అందజేయాలి. 

ఈసారి ఇలా చేయడం వల్ల ఈసీబీ వైపు ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండదు’’ అని ఫారూఖ్‌ ఇంజనీర్‌ పీటీఐతో పేర్కొన్నాడు. కాగా బాలీవుడ్‌ నటి షర్మిలాను పెళ్లాడిన మన్సూర్‌కు కుమారుడు సైఫ్‌తో పాటు కుమార్తెలు సబా, సోహా ఉన్నారు. 

ఇదిలా ఉంటే.. తాజా ఇంగ్లండ్‌ పర్యటనను టీమిండియా పరాజయంతో మొదలుపెట్టింది. లీడ్స్‌ వేదికగా తొలి టెస్టులో గిల్‌ సేన.. స్టోక్స్‌ బృందం చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య మొత్తంగా ఐదు టెస్టులు జరుగనుండగా.. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియం రెండో మ్యాచ్‌ (జూలై 2-6)కు వేదిక. 
 చదవండి: ఇకపై మళ్లీ ఆడగలనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement