బట్లర్‌ డబుల్‌ సెంచరీ.. కేవలం రెండో ప్లేయర్‌ | Jos Buttler Achieves What Only 1 Other Player Has Done For England | Sakshi
Sakshi News home page

బట్లర్‌ డబుల్‌ సెంచరీ.. కేవలం రెండో ప్లేయర్‌

Jul 14 2026 7:56 PM | Updated on Jul 14 2026 8:11 PM

Jos Buttler Achieves What Only 1 Other Player Has Done For England

photo credit: ECB X

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డే ద్వారా ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆట పరంగా అతడు ఈ మ్యాచ్‌లో నిరాశపరిచినా (14 బంతుల్లో 5 పరుగులు), తన దేశం తరఫున అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌ జోస్‌కు వన్డేల్లో 200వది. ఇతనికి ముందు కేవలం ఇయాన్‌ మోర్గాన్‌ (225) మాత్రమే ఇంగ్లండ్‌ తరఫున 200 వన్డేల మార్కును తాకాడు.

చివరిగా భారత్‌తోనే జరిగిన టీ20లో మెరుపు శతకం బాదిన జోస్‌, ఆ ఫామ్‌ను తొలి వన్డేలో ప్రదర్శించలేకపోయాడు. వన్డేల్లో ఇతనికిది వరుసగా ఏడో వైఫల్యం (కనీసం హాఫ్‌ సెంచరీ కూడా చేయలేకపోవడం).

బట్లర్ వన్డే కెరీర్ విషయానికొస్తే.. 2012లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేసి తొలి మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. అయితే, ఆ తర్వాత ఇంగ్లండ్ అత్యుత్తమ పరిమిత ఓవర్ల బ్యాటర్లలో ఒకరిగా ఎదిగాడు.

ఇప్పటివరకు 172 ఇన్నింగ్స్‌ల్లో 38.87 సగటున 5520 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 29 అర్ధశతకాలు ఉన్నాయి. పరుగుల పరంగా జో రూట్, ఇయాన్ మోర్గాన్ తర్వాత ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. రూట్–డాసన్ పోరాటంతో గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది.

పేసర్లకు అనుకూలించిన పిచ్‌పై 107 పరుగులకే 6 వికెట్లు పోయిన ఆ జట్టును జో రూట్‌ (76 నాటౌట్‌), లియామ్‌ డాసన్‌ (68) అదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు జీవం పోశారు.

ఫలితంగా ఆ జట్టు నిర్ణీత 47.5  ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 4 వికెట్లు తీయగా.. ప్రసిద్ద్‌ కృష్ణ, గుర్నూర్‌ బ్రార్‌ తలో 2, బుమ్రా, దూబే తలో వికెట్‌ తీశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement