
ఆసుపత్రికి తీసుకెళ్లగానే పంత్ అడిగిన తొలి ప్రశ్న
వాళ్ల అమ్మకైతే నడుస్తాడో లేడోనన్న బెంగ
అదృష్టం, రక్తనాళాల పనితీరువల్లే మామూలు స్థితికి
రిషభ్ పంత్ పోరాటంపై డాక్టర్ పర్దివాలా వ్యాఖ్య
లండన్: భారత వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ ఇప్పుడైతే మైదానంలో సెంచరీలు చేసి... పిచ్పై ఎగిరి గంతులేస్తూ... పల్టీలతో సంబరాలు చేసుకుంటున్నాడు. కానీ... రెండున్నరేళ్ల క్రితమైతే అతను ఇకపై క్రికెట్ ఆడనేమో అన్న కంగారులో మంచంపై ఉండిపోయాడు. 2022లో పంత్ ఘోరమైన ప్రమాదానికి గురయ్యాడు. ఆ ఏడాది డిసెంబర్ 30వ తేదీన ఢిల్లీ నుంచి సొంతూరు రూర్కీకి కారు నడుపుకుంటూ వెళ్తుండగా ఆ కారు అదుపుతప్పి వేగంగా డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది.
ఈ ఘోరప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు ప్రాణంమీదికి తెచ్చుకున్నాడు. వెంటనే హాస్పిటల్కు తరలించగా... స్పృహలోకి రాగానే తొలుత క్రికెట్ కెరీర్ గురించే ఆందోళన చెందాడు. తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ దిన్షా పర్దివాలాతో ‘ఇకపై నేను మళ్లీ క్రికెట్ ఆడగలనా?’ అని ప్రశ్నించాడని ఆ డాక్టర్ వెల్లడించాడు. గతేడాది పారిస్ ఒలింపిక్స్లో భారత బృందానికి చీఫ్ మెడికల్ ఆఫీసర్గా వ్యవహరించిన ఈ సీనియర్ డాక్టర్ అప్పటి ప్రమాదం, తదనంతర చికిత్సపై ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంగతులివి...
బతికి బట్టకట్టడమే గొప్ప
ఘోరమైన ఆ ప్రమాదంలో రిషభ్ బతికి బట్టకట్టడమే పెద్ద అదృష్టం. మంచంపై అతన్ని మొదట చూసినప్పుడు... పంత్ కుడికాలు మామూలు స్థితిలోనే లేదు. అక్కడక్కడ విరిగి చాలావరకు జరిగిపోయింది. ఆ కాలి చీలమండకు పెద్ద గాయమే అయ్యింది. ఒళ్లంతా గాయాలే. ప్రమాదంలో చర్మం అంతా గీరుకొనిపోయింది.
శరీరభాగాల్లో పెద్దగా రాసుకుపోయింది. మెడ నుంచి మోకాళ్ల వరకైతే పైచర్మమంతా చీరుకుపోయింది. కారు లోపలి నుంచి లాగే ప్రయత్నంలో పగిలిన అద్దాలు అతని వీపును, చర్మాన్ని లోపలిదాకా చీల్చాయి. ఇలాంటి పరిస్థితిలోని ఓ క్షతగాత్రుడు బ్రతకడమే కష్టం. పంత్ చాలా అదృష్టవంతుడు కాబట్టే బ్రతకడం కాదు... ఏకంగా తనకిష్టమైన ఆటను ఆడేస్తున్నాడు
635 రోజులపాటు...
వెంటనే ఐసీయూలో చికిత్స, తదనంతరం మోకాలుకు పలుమార్లు ఆపరేషన్లు, రోజుల తరబడి క్రమం తప్పని ఫిజియోథెరపీ చికిత్స అతన్ని బతికించాయి. కానీ ఆడించాలంటే అది చాలదుగా... ఇంకా చేయాలి. అప్పటిదాకా వైద్యులు శ్రమించారు. అక్కడి నుంచి వైద్యులతో కలిసి పంత్ శ్రమించాల్సి వచ్చింది.
అలా ఓ వారమో నెలనో కాదు... ఏకంగా 635 రోజులు అంటే దాదాపు రెండేళ్లపాటు సాగిన వైద్యచికిత్స, పునరావాస కార్యక్రమాలతోనే రిషభ్ ఓ పెషెంట్ నుంచి ఎప్పట్లాగే మళ్లీ క్రికెటర్ అయ్యాడు. నిజం చెప్పాలంటే అతని పోరాటం క్రీడాచరిత్రలో నిలిపోయే పాఠమని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఘోరమైన ప్రమాదాల్లో మరణాలే ఎక్కువగా సంభవిస్తాయి.
రక్తనాళాలు పని చేయడంవల్లే...
ప్రమాదం తీవ్రత వల్ల అతని మోకాలు నుంచి పాదం వరకు జరిగిపోవడంతో అక్కడక్కడ ఎముక స్నాయువులు విరిగాయి. ఇలాంటపుడు కండరాలు, ప్రధాన రక్తనాళాలు కూడా తెగిపోయి రక్తసరఫరా ఆగిపోతుంది. దీంతో కాలు తీసేయాల్సిన పరిస్థితి రావడం సహజం. కానీ అదృష్టమేమిటంటే... ఇంత జరిగినా కూడా అతని రక్తనాళాలేవీ గాయపపడలేదు. తెగలేదు. దీనివల్లే అతని కాలు తీసేయాల్సిన దుస్థితి రాలేదు. కాలు తిరిగి యథాతథ స్థితికి వచ్చేందుకు, నడిచేందుకు, ఇప్పుడైతే ఆడేందుకు పనిచేస్తుందంటే దీనికంతటికి ప్రధాన కారణం బలమైన రక్తనాళాలే! ఇది ఎంతో అదృష్టముంటేగానీ జరగదు.
వాళ్ల అమ్మయితే నడుస్తాడా అని విలపించింది
రిషభ్ తాను మళ్లీ క్రికెట్ ఆడగలనా అని ప్రశ్నిస్తే... అతడి పరిస్థితిని చూసిన వాళ్ల అమ్మయితే ‘నా కొడుకు అసలు నడవగలడా’ అని విలపించింది. దీంతో అప్పుడు గాయాల తీవ్రత గురించి వివరించాను. మళ్లీ మోకాలు పునర్నిర్మాణానికి ఉన్న అవకాశాల్ని చెప్పాను. ఆ తర్వాతే ఏదైనా ఆశించవచ్చని బదులిచ్చాను. 2023 జనవరి 6న నిష్ణాతులైన ఆర్థోపెడిక్ వైద్య బృందం నాలుగు గంటలపాలు తొలి సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది.
మూడు చోట్ల ఎముక స్నాయువుల్ని సరిచేసింది. మామూలుగా విరిగిన చోట్ల చికిత్స చేసింది. కొన్నివారాల తర్వాత కూడా అతను సొంతంగా తన పళ్లను బ్రష్ చేసుకోలేకపోయాడు. చేతులకు అయిన గాయాలు, చర్మంలోతుగా అయిన గాట్లతో చేతుల్ని కూడా సాధారణంగా కదిలించలేకపోయాడు. మెల్లమెల్లగా నీళ్లు తాగడంతో మొదలుపెట్టి... తర్వాత తర్వాత అన్ని పనులు
అలవాటు చేసుకున్నాడు.
హ్యాట్రిక్ మిరాకిల్స్ వల్లే...
సర్జరీ, తదనంతరం పరిస్థితిని సమీక్షించిన మీదటే పంత్ తల్లికి అతను నడవగలడనే ధైర్యమిచ్చాం. ఇక అతను మాత్రం ఇంతటి ఘోరమైన ప్రమాదంలో జీవించి ఉండటమే అద్భుతమని, కాలు తిరిగి సాధారణ స్థితిలో నడవడం, పరుగెత్తడం మరో అద్భుతమని చెప్పాను. ఇక క్రికెట్ ఆడటమైతే మూడో మిరాకిల్ అని అతని ధైర్యాన్ని పెంచాను. తను కూడా ఆత్మస్థయిర్యంతో మెలిగాడు.
తనకెంతో ఇష్టమైన క్రికెట్ కోసం తిరిగి పునరాగమనం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశాడు. అందువల్లే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి తర్వాత మైదానంలోకి వచ్చి యథేచ్ఛగా ఆడగలుగుతున్నాడు. అయితే సెంచరీ చేశాక ఉత్సాహంతో పంత్ మైదానంలో పల్టీలు కొడుతున్నాడు. ఈ విన్యాసాలు చేయకపోతేనే మంచిదని సలహా ఇస్తున్నా.