గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత వెయిట్లిఫ్టర్లు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా మహిళల 53 కేజీల విభాగంలో వెయిట్లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం సొంతం చేసుకుంది.
ఈ ఈవెంట్ ఆరంభం నుంచే జ్ఞానేశ్వరి అదరగొట్టింది. తొలుత స్నాచ్ విభాగంలో తన మూడో ప్రయత్నంలో 88 కేజీలను ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో కూడా తన జోరును కొనసాగించింది. మొదటి ప్రయత్నంలో 103 కేజీలు, రెండో ప్రయత్నంలో 107 కేజీలు ఎత్తగా.. మూడో ప్రయత్నంలో ఏకంగా 111 కేజీలు లిఫ్ట్ చేసింది.
జ్ఞానేశ్వరి మొత్తం 199 కేజీలు (స్నాచ్ 88 కేజీలు + క్లీన్ అండ్ జెర్క్ 111 కేజీలు) లిఫ్ట్ చేసి రెండో స్దానంలో నిలిచి రజతం కైవసం చేసుకుంది. మొత్తం 206 కేజీలు (93 కేజీలు + 113 కేజీలు) ఎత్తిన నైజీరియా అథ్లెట్ ఒనోమే దిదిద్కు స్వర్ణ పతకం దక్కింది.


