గానకోకిల ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచాన్ని తీవ్ర శోకసముద్రంలో ముంచేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషాద సమయంలో ఆమె మనవరాలు అప్సర విద్యుల(Apsara Vydyula)పై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అనవసరపు విమర్శలు, ట్రోలింగ్కు దిగారు. జానకి భౌతికకాయం వద్ద అప్సర ఏడవలేదంటూ కొందరు చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న ట్రోలింగ్కు అప్సర సోషల్ మీడియా వేదికగా అత్యంత హుందాగా, ఎమోషనల్గా సమాధానమిచ్చారు.
కంటికి కనిపించని కన్నీళ్లతో మా బాధను కొలవొద్దు
‘మనకు ఇష్టమైన మనిషిని కోల్పోయినప్పుడు వచ్చే దుఃఖం కేవలం కొన్ని రోజుల్లో మాయమైపోయేది కాదు. అది జీవితాంతం ఒక గుండె బరువుగా మారి, మనసును మెలిపెడుతూనే ఉంటుంది. దయచేసి కంటికి కనిపించని కన్నీళ్లతో మా గుండెల్లోని బాధను ముడిపెట్టొద్దు’ అంటూ అప్సర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ దుఃఖం నుంచి ఇంకా కోలుకోలేదు
ఈ ప్రపంచంలో మా నానమ్మ(జానకి)కు మా అక్క వర్ష అంటే ప్రాణం. వాళ్లిద్దరూ ఒకేలా ఉండేవారు. పోలికల దగ్గర నుంచి మాట్లాడడం వరకూ ఒకరి కోసం ఒకరు పుట్టారా అనేలా ఉండేవారు. నిజానికి నానమ్మ అంతక్రియలు మా అక్క వర్ష నిర్వహించాలి. కానీ, ఆమె 2023లోనే కన్నుమూసింది. ఆ దుఃఖం నుంచి మేం ఇప్పటికీ కోలుకోలేదు. వర్ష చేయాల్సిన బాధ్యతలు నేను ఎంత బాధతో నిర్వహించానో నా మనసుకు తెలుసు. మాకెంతో ఇష్టమైన అక్క, నానమ్మ మమ్మల్ని వదిలి వెళ్లారనే బాధ కంటే.. వారిద్దరూ స్వర్గంలో ఒకరినొకరు కలుసుకుని ఉంటారనే ఆలోచనే నాకు ఇప్పుడు పెద్ద ఓదార్పునిస్తోంది’ అని అప్సర తన ఇన్స్టా ఖాతాలో రాసుకొచ్చింది.
ప్రస్తుతం అప్సర చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దుఃఖాన్ని ప్రదర్శించే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుందని, కష్ట సమయంలో ఉన్న ఒక కుటుంబంపై ఇలాంటి ట్రోలింగ్ చేయడం సరికాదంటూ నెటిజన్లు అప్సరకు మద్దతుగా నిలుస్తున్నారు.


