PC: BCCI/ Instagram
వచ్చే ఏడాది మరో ఐసీసీ మెగా టోర్నమెంట్ క్రికెట్ ప్రేమికులను అలరించనుంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబరు- నవంబరు మధ్య వన్డే ప్రపంచకప్-2027 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మపైనే కళ్లన్నీ నిలిచాయి.
రో-కో ఆడతారా?
వీరిద్దరు ఈ మెగా టోర్నీ ఆడతారా? లేదా అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. అయితే, ఇటీవల మంచి ఫామ్తో అలరిస్తున్న రో-కో తాము మాత్రం ప్రపంచకప్ టోర్నీకి సిద్ధంగా ఉన్నామని బలమైన సంకేతాలు ఇచ్చారు. యాజమాన్యం కూడా అనుభవానికి పెద్దపీట వేసి రోహిత్- కోహ్లిని ఆడించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఊహించని పేరు!
ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వెటరన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ను వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు ఎంపిక చేయాలని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. సౌతాఫ్రికాలో భువీ సేవలు జట్టుకు అవసరమని అభిప్రాయపడ్డాడు.
ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘అవును భువనేశ్వర్ కుమార్ ప్రపంచకప్ జట్టులో ఉండాలి. నేను అతడితో ఈ విషయం గురించి మాట్లాడతాను. దేశీ క్రికెట్లో భువీ అన్ని టోర్నీలు ఆడాలి. ఫస్ట్క్లాస్ క్రికెట్, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ.. ఇలా అన్నీ ఆడాలి.
అక్కడ సత్తా చాటితే సౌతాఫ్రికాకు తప్పక వెళ్లగలడు. అక్కడ జట్టుకు అతడి అవసరం ఎంతగానో ఉంటుంది’’ అని అశూ పేర్కొన్నాడు. కాగా 36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ 2022లో చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత దేశీ క్రికెట్, ఐపీఎల్పై దృష్టి పెట్టిన భువీ.. ఆయా టోర్నీల్లో సత్తా చాటుతున్నాడు.
నిలకడగా రాణిస్తున్న భువీ
ముఖ్యంగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు ట్రోఫీలు గెలవడంలో స్వింగ్ సుల్తాన్ భువీది కీలక పాత్ర. ఆర్సీబీ తరఫున 2025, 2026 సీజన్లలో కలిపి ఈ రైటార్మ్ పేసర్ 45 వికెట్లు కూల్చాడు. ఇక సౌతాఫ్రికాలో బౌన్సీ పిచ్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అశ్విన్ భువీని వరల్డ్కప్లో ఆడిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి అశూ ఎంచుకున్న భారత జట్టు
శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్
రిజర్వు ప్లేయర్లు: యశస్వి జైస్వాల్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, అర్ష్దీప్ సింగ్.


