చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌.. ఈస్ట్‌ జోన్‌ అతి భారీ స్కోరు | Ishan Kishan creates Duleep Trophy history 270 Guides East Zone To 708 | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌.. ఈస్ట్‌ జోన్‌ అతి భారీ స్కోరు

Sep 7 2026 5:34 PM | Updated on Sep 7 2026 5:56 PM

Ishan Kishan creates Duleep Trophy history 270 Guides East Zone To 708

Photo Credit: BCCI Domestic X

సౌత్‌ జోన్‌తో జరుగుతున్న దులిప్‌ ట్రోఫీ-2026 ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.  చెన్నై వేదికగా ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ భారీ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.  ఫలితంగా టైటిల్‌ పోరులో ఈస్ట్‌ జోన్‌ 708 పరుగుల మేర అతి భారీ స్కోరు సాధించింది. 

ఈస్ట్‌ జోన్‌- సౌత్‌ జోన్‌ జట్ల మధ్య దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్‌ టోర్నీ దులిప్‌ ట్రోఫీ ఫైనల్‌ ఆదివారం మొదలైంది. చెపాక్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన ఈస్ట్‌ జోన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో సోమవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. 

టాపార్డర్‌ సూపర్‌
ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్‌ (72), వైభవ్‌ సూర్యవంశీ (44) శుభారంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ శిఖర్‌ మోహన్‌ భారీ అర్ధ శతకం (85)తో ఆకట్టుకున్నాడు. అయితే, నాలుగో స్థానంలో వచ్చిన సుదీప్‌ కుమార్‌ ఘరామీ (6) మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 

ఇషాన్‌ డబుల్‌ సెంచరీ
సౌత్‌ జోన్‌ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ఇషాన్‌.. డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత గాయపడి మైదానం వీడాడు. అయితే, జట్టుకు అవసరమైన మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. మొత్తంగా 334 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 30 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 270 పరుగులు సాధించాడు. 

శతక్కొట్టిన కుశాగ్రా
ట్రిపుల్‌ సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ త్రిపురాన విజయ్‌ బౌలింగ్‌లో స్మరణ్‌ రవిచంద్రన్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఇషాన్‌ కిషన్‌ మారథాన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మిగిలిన వారిలో కుమార్‌ కుశాగ్రా శతక్కొట్టగా (101), అనుకూల్‌ రాయ్‌ (45), ఎండీ కొనియన్‌ ఖురేషి (40) రాణించారు. 

టెయిలెండర్లలో మహ్మద్‌ షమీ 28 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ముకేశ్‌ కుమార్‌ డకౌట్‌ అయ్యాడు. సౌత్‌ జోన్‌ బౌలర్లలో త్రిపురాణ విజయ్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చామా మిలింద్‌, శ్రేయస్‌ గోపాల్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షేక్‌ రషీద్‌కు ఒక వికెట్‌ దక్కింది.

చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌
దులిప్‌ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌ రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు నమన్‌ ఓజా పేరిట ఉండేది. సెంట్రల్‌ జోన్‌ తరఫున 2014లో నార్త్‌ జోన్‌తో మ్యాచ్‌ సందర్భంగా అతడు 217 పరుగులు స్కోరు చేశాడు. తాజాగా ఇషాన్‌ 270 పరుగులు సాధించి నమన్‌ ఓజాను అధిగమించాడు.

చదవండి: షఫాలీ పట్ల దురుసు ప్రవర్తన.. మూల్యం చెల్లించిన పాక్‌ కెప్టెన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement