IND vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులే ట్విస్టులు.. ఆఖరికి | IND A vs SL A ODI: Last Ball Thriller High Drama Super Over Winner is | Sakshi
Sakshi News home page

IND vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులే ట్విస్టులు.. ఆఖరికి

Jun 15 2026 6:34 PM | Updated on Jun 15 2026 8:02 PM

IND A vs SL A ODI: Last Ball Thriller High Drama Super Over Winner is

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌-‘ఎ’ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. తొలుత అఫ్గనిస్తాన్‌ చేతిలో ఓడిన భారత జట్టు తాజాగా.. సోమవారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ పరాజయం పాలైంది.

ముక్కోణపు వన్డే సిరీస్‌
కాగా శ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్‌, అఫ్గనిస్తాన్‌ ‘ఎ’ జట్ల మధ్య జూన్‌ 9న ముక్కోణపు వన్డే సిరీస్‌ మొదలైంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్‌ 8 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ భారత్‌పై 4 పరుగుల తేడాతో గట్టెక్కింది.

ఇక మూడో మ్యాచ్‌లో శ్రీలంక అఫ్గనిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించగా.. నాలుగో మ్యాచ్‌లో భాగంగా సోమవారం భారత్‌- శ్రీలంక రెండోసారి తలపడ్డాయి. టాస్‌ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు.. తిలక్‌ వర్మ సేన తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

265 పరుగులు చేసి ఆలౌట్‌
గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న భారత ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (11), వైభవ్‌ సూర్యవంశీ (21) ఈసారి నిరాశపరిచారు. ఫామ్‌లో ఉన్న రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈసారి 37 పరుగులకే పరిమితం కాగా.. కెప్టెన్‌ తిలక్‌ వర్మ కేవలం 23 పరుగులే చేశాడు. ఆయుశ్‌ బదోని 15, నిశాంత్‌ సింధు 6, అనుకుల్‌ రాయ్‌ 8, అర్షద్‌ ఖాన్‌ 2 పరుగులు చేసి నిష్క్రమించారు.

అయితే, ఆల్‌రౌండర్లు సూర్యాంశ్‌ షెడ్గే 66 బంతుల్లో 72, విప్రాజ్‌ నిగమ్‌ 49 బంతుల్లో 51 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి అర్ద శతకాల కారణంగా భారత్‌ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

పది పరుగుల పెనాల్టీ
శ్రీలంక బౌలర్లలో విజయకాంత్‌ వియస్కాంత్‌, మొహ్మద్‌ షిరాజ్‌ చెరో మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. కెప్టెన్‌ సహన్‌ అరాచిగే, వనుజా సహన్‌, కుగాతస్‌ మతూలన్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. అయితే, విప్రాజ్‌ నిగమ్‌ పరుగులు తీసే క్రమంలో రెండుసార్లు పిచ్‌ మధ్యభాగంలోకి వచ్చాడు. దీంతో భారత జట్టుకు పది పరుగుల పెనాల్టీ పడింది.

ఫలితంగా శ్రీలంక 10/0తో తమ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. అయితే, బౌలింగ్‌ సమయంలో బంతి వికెట్‌ కీపర్‌ హెల్మెట్‌కు తాకడంతో శ్రీలంకకు కూడా పెనాల్టీ పడింది.

ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు నిరోషన్‌ డిక్‌విల్లా (37), అవిష్క ఫెర్నాండో (22) మెరుగైన ఆరంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విశేన్‌ హలంబగే (17) విఫలమయ్యాడు. కెప్టెన్‌ సహన్‌ అరాచిగే 8 పరుగులకే నిష్క్రమించగా.. అహాన్‌ విక్రమసింఘే 6 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ సదీర సమరవిక్రమ ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా వనుజా సహన్‌ (25) రాణించగా.. విజయకాంత్‌ వియస్కాంత్‌ 39 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు.

నరాలు తెగే ఉత్కంఠ
ఇక 47 ఓవర్లు పూర్తయ్యేసరికి శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేయగా.. విజయానికి 18 బంతుల్లో 18 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికి సదీర సమరవిక్రమ 104 బంతుల్లో 88 పరుగుల వద్ద ఉన్నాడు.

ఈ క్రమంలో 48వ ఓవర్లో ఆరు పరుగులు రాగా.. శ్రీలంక విజయానికి 12 బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సదీర ఆచితూచి ఆడాడు. ఇలాంటి తరుణంలో యశ్‌ ఠాకూర్‌ నోబాల్‌తో 48వ ఓవర్‌ ఆఖరి బంతికి లంకకు ఫ్రీహిట్‌ రాగా.. గుణశేఖర ఫోర్‌ బాదాడు. దీంతో చివరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. అర్షద్‌ ఖాన్‌ బంతితో రంగంలోకి దిగాడు.

తొలి బంతికి పరుగులేమీ ఇవ్వని.. అర్షద్‌ రెండో బంతికి సదీర సమరవిక్రమను బౌల్డ్‌ చేశాడు. దీంతో 93 పరుగుల వద్ద సదీర నిష్క్రమించగా.. నాలుగు బంతుల్లో ఐదు పరుగులుగా లంక విజయ సమీకరణం మారింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన షిరాజ్‌ మూడో బంతికి సింగిల్‌ తీయగా.. ఆ తర్వాత గుణశేఖర సైతం సింగిల్‌ పూర్తి చేశాడు.

దీంతో రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరం కాగా.. అర్షద్‌పై ఒత్తిడి పెరిగింది. ఐదో బంతికి షిరాజ్‌ సింగ్‌ తీయడంతో సమీకరణం ఆఖరి బంతికి రెండు పరుగులుగా మారింది. అయితే, ఆఖరి బంతికి పరుగు తీసిన గుణశేఖర రెండో పరుగు కోసం రాగా.. రనౌట్‌ అయ్యాడు. దీంతో స్కోర్లు సమం అయ్యాయి.

సూపర్‌ ఓవర్‌ ముగిసిందిలా..
అయితే, గుణశేఖర షాట్‌ ఆడినట్లు కనిపించలేదని.. బంతి ఫ్లిక్‌ అయి కీపర్‌ వైపు వెళ్లింది కాబట్టి దీనిని రన్‌గా పరిగణించవద్దని భారత శిబిరం కోరగా.. ప్రతికూల నిర్ణయమే వచ్చింది. ఇక ఫలితం కోసం సూపర్‌ ఓవర్‌ నిర్వహించాల్సి ఉండగా.. వెలుతురులేమి సమస్యగా మారింది. అయినప్పటికీ సూపర్‌ కోసం పట్టుపట్టగా.. ఫ్లడ్‌లైట్లు లేకుండానే శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

భారత కెప్టెన్‌ తిలక్‌ వర్మ అర్షద్‌ ఖాన్‌ చేతికి బంతినివ్వగా.. వైడ్‌, నోబాల్‌ రూపంలో భారత్‌ మూల్యం చెల్లించింది. శ్రీలంక 16 పరుగులు చేసింది. అయితే, నోబ్‌ విషయంలో తిలక్‌ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. కానీ మ్యాచ్‌ కొనసాగింది. 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 9 పరుగులే చేయడంతో ఓటమి ఖరారైంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement