IND VS ENG 1st Test Day 5: టీమిండియాను కలవరపెడుతున్న చెడు శకునాలు..! | IND VS ENG 1st Test: Team India Fears Of Bad Sentiments Before Crucial Day 5 Start | Sakshi
Sakshi News home page

IND VS ENG 1st Test Day 5: టీమిండియాను కలవరపెడుతున్న చెడు శకునాలు..!

Jun 24 2025 3:49 PM | Updated on Jun 24 2025 4:53 PM

IND VS ENG 1st Test: Team India Fears Of Bad Sentiments Before Crucial Day 5 Start

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య లీడ్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు సమానమైన విజయావకాశాలు ఉన్నాయి. ఇంగ్లండ్‌ గెలవాలంటే చివరి రోజు 350 పరుగులు (90 ఓవర్లలో) సాధించాలి. అదే భారత్‌ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి. ఆధునిక టెస్ట్‌ క్రికెట్‌లో రెండూ అసాధ్యం కాదు. ఫలితం ఏ జట్టుకైనా అనుకూలంగా రావచ్చు.

అయితే, గత రికార్డులను పరిశీలిస్తే మాత్రం ఎ‍డ్జ్‌ ఇంగ్లండ్‌కే సూచిస్తున్నాయి. 2019లో ఇదే మైదానంలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్‌ నమ్మశక్యంకాని శతకాన్ని (135 నాటౌట్‌) బాది ఇంగ్లండ్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో రికార్డు స్థాయిలో 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. 

లీడ్స్‌ మైదానానికి 350 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఘన చరిత్ర ఉండటం ఐదో రోజు ఆట​కు ముందు భారత ఆటగాళ్లను డిఫెన్స్‌లో పడేస్తుంది. అప్పట్లో ఆ లక్ష్యాన్ని ఛేదించింది ఇంగ్లండే కావడం టీమిండియాను మరింత బయపెడుతుంది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు సైతం చివరి రోజు 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తగ్గేదేలేదంటున్నారు.

చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియాను మరో చెడు సూచకం కూడా బయపెడుతుంది. భారత్‌ తమ యావత్‌ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 350 ప్లస్‌ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఒకే ఒకసారి చతికిలపడింది. టీమిండియా 59 మ్యాచ్‌ల్లో 350 ప్లస్‌ లక్ష్యాలను కాపాడుకునేందుకు బరిలోకి దిగగా.. 42 సార్లు సఫలమైంది. ఒకే ఒక సందర్భంలో బోల్తా పడింది. ఆ ఒక్క ఓటమి ఇంగ్లండ్‌ చేతిలోనే కావడం టీమిండియాను కలవరపెడుతుంది. 

2022లో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 378 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఇంగ్లండ్‌ చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో రూట్‌, బెయిర్‌స్టో అద్భుత శతకాలు సాధించి ఇంగ్లండ్‌ను గెలిపించారు.

మరోవైపు చివరి రోజు ఆటకు ముందు వాతావరణం కూడా భారత్‌ విజయానికి అడ్డుకట్ట వేసేలా కనిపిస్తుంది. మ్యాచ్‌ మధ్య మధ్యలో వరుణుడు పలకరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇన్ని ప్రతికూలతల నడుమ భారత బౌలర్లు చివరి రోజు ఏం చేస్తారోనని టీమిండియా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్కోర్‌ వివరాలు..
భారత్‌: 471 & 364
ఇంగ్లండ్‌: 465 & 21/0

చివరి రోజు భారత్‌ గెలుపుకు 10 వికెట్లు కావాలి. అదే ఇంగ్లండ్‌ గెలవాలంటే 90 ఓవర్లలో 350 పరుగులు చేయాలి. ఇంగ్లండ్‌ ఓపెనర్లు జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement