PC: BCCI
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఫిట్నెస్కు మారుపేరైన ఈ రన్మెషీన్.. ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అఫ్గన్తో సిరీస్కు అతడు పూర్తిగా దూరమయ్యాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే ప్రకటించింది.
వన్డే జట్టులోకి జైస్వాల్
కోహ్లి స్థానంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్ను ఎంపిక చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఇషాన్ కిషన్కు కూడా అఫ్గన్తో వన్డే సిరీస్లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో కోహ్లి గైర్హాజరీలో వన్డౌన్లో ఎవరు ఆడతారన్న చర్చ నడుస్తోంది.
ఓపెనర్లుగా జైసూ, ఇషాన్కు అనుభవం ఉంది. ఇక ఇషాన్ వన్డౌన్లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ ఈ జార్ఖండ్ డైనమైట్ వైపే మొగ్గుచూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ ముగ్గురికీ అవకాశం
ఈ విషయంపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. అఫ్గనిస్తాన్తో శనివారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశం. కోహ్లికి బదులు ఇషాన్ లేదా కేఎల్ రాహుల్.. లేదంటే యశస్వి జైస్వాల్ ఎవరైనా ఆడవచ్చు.
వాళ్లకు ఇదొక మంచి అవకాశం. మాకు మూడు వన్డేలు ఉన్నాయి. కాబట్టి వివిధ ఆప్షన్లు ప్రయత్నించడానికి అవకాశం దొరికింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టు కూర్పు దెబ్బతినకుండా ఉండేలా విభిన్నమైన ప్లేయర్లను ప్రయత్నించేందుకు ఇదో చక్కటి అవకాశం’’ అని మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యా లేదని.. అతడు మ్యాచ్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మోర్నీ మోర్కెల్ తెలిపాడు.
చదవండి: వైభవ్ తమ్ముడి సూపర్ సెంచరీ


