మహిళా రెజ్లర్లకు భద్రత కల్పించండి: కోర్టు | Court Has Ordered Delhi Police To Protect Women Wrestlers Who Accused Brij Bhushan Of Sexual Harassment | Sakshi
Sakshi News home page

మహిళా రెజ్లర్లకు భద్రత కల్పించండి: కోర్టు

Aug 23 2024 1:43 PM | Updated on Aug 23 2024 2:52 PM

Court Has Ordered Delhi Police To Protect Women Wrestlers

న్యూఢిల్లీ: ముప్పున్న మహిళా రెజ్లర్లకు భద్రతను ఉపసంహరించడం తగదని పేర్కొన్న కోర్టు తక్షణమే భద్రత కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ముగ్గురు రెజ్లర్లు గతంలో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఇదివరకే ఢిల్లీ పోలీసులు చార్జిషీట్‌ నమోదు చేశారు.

కేసు విచారణలో ఉంది. కాగా... కేంద్రంలో అధికారపక్షం నేత అయిన బ్రిజ్‌భూషణ్‌ నుంచి హాని ఉంటుందని గతంలో ఆ ముగ్గురు రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించారు. కానీ ఇప్పుడు ఉన్నపళంగా పోలీసు భద్రతను ఉపసంహరించడం ఏంటని అడిషనల్‌ చీఫ్‌ జుడిషియల్‌ మెజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పుత్‌ ఢిల్లీ పోలీసులను తలంటారు.

వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. రెజ్లర్ల భద్రతపై స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ‘ఎక్స్‌’ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రిజ్‌భూషణ్‌పై పోరాడుతున్న రెజ్లర్లకు భద్రతను తొలగించారని వినేశ్‌ పోస్ట్‌ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement