Photo Credit: Twitter
ఐర్లాండ్పై విజయంతో 2027 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించిన అఫ్గానిస్తాన్.. వెస్టిండీస్ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని విండీస్ కోల్పోయింది. ఇక ప్రపంచకప్కు అర్హత సాధించేందుకు విండీస్ క్వాలిఫయింగ్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది.
నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న ఎనిమిది జట్లు నేరుగా వన్డే ప్రపంచకప్కు అర్హత సాధిస్తాయి. ఇక ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు కూడా అర్హత సాధించాయి. అయితే వెస్టిండీస్ ప్రస్తుతం ర్యాంకింగ్స్లో పదో స్థానంలో కొనసాగుతోంది.
జింబాబ్వే 11వ స్థానంలో ఉన్నప్పటికీ ఆతిథ్య హోదాలో ఆ జట్టు అర్హత సాధించడంతో కటాఫ్ తేదీ సమయానికి వెస్టిండీస్కు టాప్-9లో ప్రవేశించేందుకు చాన్స్ లేదు. ఒకవేళ సెప్టెంబర్-అక్టోబర్లో భారత్తో జరగనున్న వన్డే సిరీస్లో వెస్టిండీస్ అన్ని మ్యాచ్లు గెలిచినప్పటికీ వరల్డ్కప్కు అర్హత సాధించే అవకాశం మాత్రం వారికి లేదు.
సెప్టెంబర్ 30 డెడ్లైన్ ప్రకారం టాప్-8లో ఉన్న భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అప్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్తో పాటు సౌతాఫ్రికా (ఆతిథ్య దేశం), జింబాబ్వే (ఆతిథ్య దేశం) నేరుగా వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించనున్నాయి. ఇక వెస్టిండీస్ మాత్రం వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించకపోవడం ఇది వరుసగా మూడోసారి.
2019, 2023 ఎడిషన్లలోనూ విండీస్ డైరెక్ట్ క్వాలిఫై సాధించడంలో విఫలమైంది. ఇక వెస్టిండీస్ ఈసారి కూడా ప్రపంచకప్లో ఆడాలంటే ఇతర అసోసియేట్ దేశాలతో కలిసి వరల్డ్కప్ క్వాలిఫయర్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా రెండో రౌండ్లో అడుగుపెడుతుంది.
కాగా మిగిలిన జట్లు రెండో రౌండ్కు అర్హత సాధించేందుక సూపర్ సిరీస్ ఆడనున్నాయి. రెండుసార్లు వన్డే ప్రపంచకప్ విజేత అయిన వెస్టిండీస్ దారుణ ఆటతీరుతో ర్యాంకింగ్స్లో అట్టడుగు స్థానంలో నిలుస్తూ నేరుగా అర్హత సాధించడంలో విఫలమవుతూనే వస్తోంది.


